Amaravati: అమరావతిలో వైభవంగా జగన్నాథ రథయాత్ర.. బంగారు చీపురుతో వీధి ఊడ్చిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(Amaravati)లో ఇస్కాన్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన జగన్నాథ రథయాత్ర మహోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రారంభించడం విశేషం.
- V Santhosh Kumar
- Published on- July 16, 2026 / 09:58 PM IST
CM Chandrababu participated in Puri Jagannath Rath Yatra held in Amaravati
- అమరావతిలో జగన్నాథ రథయాత్ర
- బంగారు చీపురుతో వీధి ఊడ్చారు
- ఐదు వేల ఆలయాల నిర్మాణం
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతి(Amaravati)లో సరికొత్త ఆధ్యాత్మిక అధ్యాయం మొదలైంది. వెంకటపాలెంలో ఇస్కాన్ (ISKCON) ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన జగన్నాథ రథయాత్ర భక్తజన సందోహం మధ్య అత్యంత వైభవంగా సాగింది. ఈ పవిత్ర మహోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని, స్వయంగా రథయాత్రను ప్రారంభించడం విశేషం. రాజధాని నగరం విశ్వనగరంగా ఎదగాలనే ఆకాంక్షతో అమరావతి బృహత్ ప్రణాళిక చిత్రపటాన్ని ఈ యాత్రలో ప్రదర్శించారు.
USA Visa Rules: ట్రంప్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. వీసా నిబంధనల్లో భారీ మార్పులు..ఇకపై నాలుగేళ్లే!
సంప్రదాయ క్రతువులు, రథం లాగిన సీఎం చంద్రబాబు:
పూరీ క్షేత్ర సాంప్రదాయాన్ని పునికిపుచ్చుకుంటూ సాగిన ఈ క్రతువులో భాగంగా, సీఎం చంద్రబాబు జగన్నాథుడి రథం ముందు బంగారు చీపురుతో వీధిని ఊడ్చి భక్తిభావం చాటుకున్నారు. అనంతరం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవి కొలువైన దివ్య రథాన్ని తాడుతో లాగి యాత్రను ముందుకు నడిపించారు. ఈ పవిత్ర వేడుకలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి పి.నారాయణలతో పాటు వేలాదిగా తరలివచ్చిన భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
ఒత్తిడికి ఆధ్యాత్మికతే పరిష్కారం: 5 వేల ఆలయాల నిర్మాణం:
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నేటి సోషల్ మీడియా యుగంలో పెరుగుతున్న ఒత్తిళ్లకు, కుటుంబ సమస్యలకు ఆధ్యాత్మికత ఒక్కటే సరైన పరిష్కారమని అన్నారు. చిన్న కుటుంబాలుగా విడిపోవడం వల్ల సామాజిక బంధాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తూ, ఉమ్మడి కుటుంబాల ప్రాధాన్యతను గుర్తుచేశారు. రాష్ట్రంలో సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం త్వరలోనే ఐదు వేల నూతన దేవాలయాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు, ఈ బృహత్తర కార్యం కోసం ఇస్కాన్ ప్రతినిధులు కూడా భాగస్వాములు కావాలని కోరారు.
