రాజధాని ప్రతిపాదన తర్వాత తొలిసారి విశాఖకు సీఎం జగన్

  • Publish Date - December 28, 2019 / 01:58 AM IST

ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టేందుకు విశాఖ రెడీ అవుతోంది. రెండు రోజుల పాటు జరిగే విశాఖ ఉత్సవ్‌కు సాగరతీరం వేదిక కానుంది. ఆర్కే బీచ్‌తో పాటు… వైఎస్సార్ సెంట్రల్ పార్క్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కళలు ప్రతిబింబించేలా… ఉత్తరాంధ్ర ప్రతిష్ఠను చాటేలా విశాఖ ఉత్సవ్‌ ఉంటుందని చెప్పారు నిర్వాహకులు. ఇక సీఎం జగన్‌ చేతుల మీదుగా విశాక ఉత్సవ్‌ ప్రారంభం కానుంది. 

విశాఖ ఉత్సవ్ – 2019కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆర్కే బీచ్‌లోని మెయిన్ స్టేజ్… వైఎస్సార్ సెంట్రల్ పార్కులో ప్లవర్ షోతో పాటు.. విశాఖను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో ఏటా విశాఖ ఉత్సవ్‌ను నిర్వహిస్తుంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా నిర్వహిస్తుండటంతో.. అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు.

ఇక ఈ విశాఖ ఉత్సవ్ లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో.. సీఎం జగన్‌కు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికేలా భారీ కార్నివాల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు కార్యక్రమాన్ని లేజర్ షో ద్వారా ప్రెజెంట్ చేస్తారు. విశాఖ ఉత్సవ్‌లో సినీ తారలు సందడి చేయనున్నారు. అలాగే… మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ లైవ్ షోను కూడా ఏర్పాటు చేశారు. దేశంలోని ప్రముఖ ఆలయాల నమూనాలతో బీచ్ రోడ్‌లో ప్రత్యేకంగా సెట్‌ వేశారు. ఫుడ్ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. విశాఖ ఉత్సవ్-2019లో భాగంగా  ఆర్టీసి కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న వీవీఎం ఆర్డీఏ సెంట్రల్ పార్కులో భారీ ఫ్లవర్ షోను ఏర్పాటు చేస్తున్నారు.

విశాఖను కార్వనిర్వాహక రాజధానిగా ప్రతిపాదించిన తరువాత సీఎం జగన్‌ తొలిసారి వస్తుండటంతో…ఘన స్వాగతం పలికేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ నాయకులు, అధికారులు ఏర్పాట్లు చేశారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి కైలాసగిరి వరకు సుమారు 24 కిలోమీటర్ల పొడవునా మానవహారం నిర్మించనున్నారు. సీఎం పర్యటన, విశాఖ ఉత్సవ్‌కు వచ్చే అతిధుల తాకిడి నేపథ్యంలో సాగరతీరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Also Read : మాగంటి, పిన్నమనేని ఫ్యామిలీస్‌ రిటైర్మెంట్‌!