CM Jagan to finalise candidates based on survey
YS Jagan – Survey : వచ్చేఎన్నికల్లో వైసీపీ (YCP) టిక్కెట్లు అశిస్తున్న నేతలు చాలా జాగ్రత్తగా వినాల్సిన వార్త ఇది.. మీ పనితీరుపై నియోజవర్గాల్లో రహస్య సర్వే జరుగుతోంది. సాధారణ సర్వేలకు భిన్నంగా జరుగుతున్న ఈ సర్వేలో సేకరించిన సమాచారం ఆధారంగానే టిక్కెట్లు ఖరారు చేయాలని సీఎం జగన్ (CM Jagan) భావిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం సమాచారాన్ని పక్కాగా తెప్పించుకుంటున్న జగన్.. మరో 50 రోజుల్లోనే లిస్టు ప్రకటించేలా రంగం సిద్ధం చేస్తున్నారట.. సీఎం జగన్ ఒక్కసారిగా తీసుకున్న ఈ నిర్ణయం పార్టీలో హాట్టాపిక్ (Hot Topic) అవుతోంది. ఇంతకీ ముఖ్యమంత్రి మనసులో ఏముంది? తెరవెనుక సర్వే రాజకీయం ఎలా సాగుతోంది?
వైసీపీలో ముందస్తు ఎన్నికలు ఉంటాయో ఉండవో గాని.. అసెంబ్లీ అభ్యర్థులు ఎవరనేది ముందుగానే ప్రకటించాలని అధికార వైసీపీ నిర్ణయించినట్లు సమాచారం. ప్రతిపక్ష టీడీపీ, జనసేన (Janasena Party) జనంలో విస్తృతంగా తిరుగుతుండటంతో అలర్ట్ అయిన సీఎం జగన్.. తమ పార్టీ కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలనే రీతిలో నేతలకు సంకేతాలు పంపుతున్నారు. సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందనే ఉద్దేశంతో టీడీపీ అధినేత ఒక్కో నియోజకవర్గంపై సమీక్ష నిర్వహిస్తూ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. బయటకు ప్రకటించకపోయినా.. వచ్చే ఎన్నికల్లో పోటీపై చూచాయగా తన అభిప్రాయాన్ని చెప్పేస్తున్నారు. మరోవైపు జనసేన కూడా ఎమ్మెల్యే అభ్యర్థులను సిద్ధం చేస్తోంది.
ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ అప్రమత్తమైనట్లు తాడేపల్లిలో వినిపిస్తున్న టాక్. ఇప్పటికే గడప గడపకు ప్రభుత్వం, జగనన్న సురక్ష పథకం కింద ఎమ్మెల్యేలు, మంత్రులు జనంలో తిరుగుతున్నా.. ఎక్కడో తేడా కొడుతున్నట్లు గమనించిన సీఎం.. అసలు క్షేత్రస్థాయి సమాచారం తెప్పించుకునేందుకు ప్రత్యేకంగా సర్వేలు చేయిస్తున్నట్లు వైసీపీ వర్గాల సమాచారం. ఎవరు ఏం చేస్తున్నారు? నియోజకవర్గాల్లో తిరుగుతున్నారా? లేదా? పార్టీకి విధేయులుగా పనిచేస్తున్నారా? తోక జాడిస్తున్నారా? ఇలా పార్టీ యాంగిల్లో సర్వే టీమ్లు ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. ఎంత పెద్ద నాయకులు అయినా పార్టీ పట్ల విధేయత లేకపోతే కష్టమని కొందరి విషయంలో ఇప్పటికే స్పష్టం చేసిన సీఎం జగన్.. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయి నేత వరకు సమాచారం తెప్పించుకోవడంపై ఫోకస్ పెట్టారు.
Also Read: వైసీపీలో కంగారు పుట్టించిన రామచంద్రాపురం రాజకీయం.. సీఎంతో సహా ముగ్గురితో బోస్ భేటీ..
ఇప్పటికే ఈ సర్వే దాదాపు పూర్తయిందని ఇంకా కొన్ని విషయాలను భేరీజు వేసుకుని అభ్యర్థులపై ఓ నిర్ణయానికి రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచిన జగన్.. విస్తృత సంక్షేమ పథకాలతో పాలన కొనసాగిస్తున్నారు. సంక్షేమ ఎజెండాతో వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో గెలవాలని పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగా ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులపై క్లారిటీ ఇవ్వనున్నారని సమాచారం.
Also Read: జంపింగ్లకు ప్రత్యామ్నాయంగా జనసేన.. వారాహి యాత్రతో పవన్ పార్టీలో జోష్!
సర్వే పూర్తయ్యాక అభ్యర్థులను ప్రకటిస్తారని.. ఇందుకోసం కనీసం 50 రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. అయితే ఈ సర్వే ఆధారంగా మొత్తం 175 మంది అభ్యర్థులను ప్రకటిస్తారా? లేక క్లియర్గా ఉన్న నియోజకవర్గాల వరకే పరిమితం చేస్తారా? అనేది మాత్రం తెలియడం లేదు. కానీ, కచ్చితంగా 50 రోజుల్లో తొలిజాబితా ప్రకటన ఉంటుందనే చర్చ మాత్రం వైసీపీలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇంతకీ ముఖ్యమంత్రి మదిలో ఏముందో? సర్వేలు ఏం తేల్చుతాయో తెలియాలంటే మరో 50 రోజులు ఆగాల్సిందే.