×
Ad

విలీనం మంట : రూట్ మార్చిన పవన్..బీజేపీపై పొగడ్తలు

కేంద్ర మంత్రి అమిత్ షాను జనసేన అధినేత పవన్ పొగడటంపై వైసీపీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. జనసేనను బీజేపీలో కలిపేసేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నారని, దానికోసం గ్రౌండ్ వర్క్ చేస్త

  • Published On : December 4, 2019 / 12:56 AM IST

Pawan Kalyan Bjp

కేంద్ర మంత్రి అమిత్ షాను జనసేన అధినేత పవన్ పొగడటంపై వైసీపీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. జనసేనను బీజేపీలో కలిపేసేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నారని, దానికోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నారంటూ కౌంటర్లిస్తున్నారు. బీజేపీలో విలీనం చేసేందుకే వారి భజన చేస్తున్నారంటూ రివర్స్ అటాక్‌కు దిగారు.

ఎవరి వర్షన్ ఎలా ఉన్నా… పవన్ కల్యాణ్ బీజేపీకి మరింత దగ్గరవుతున్నారా.. త్వరలో కాషాయ కండువా కప్పుకునే ఆలోచనలో ఉన్నారా.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. పవన్ వ్యాఖ్యలు సంకేతాలుగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మధ్యకాలం వరకు బీజేపీని, అమిత్ షాని తిట్టిపోసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఒక్కసారిగా పూర్తిగా రూట్ మార్చేశారు.

 

ఇటీవలే ఢిల్లీ వెళ్ళి వచ్చినప్పపటి నుంచి పవన్ మాట తీరు మారింది. ఢిల్లీ వెళ్లినపుడు కూడా ఆయన ఎవర్ని కలిశారనే అంశాలను రహస్యంగా ఉంచారు. అయితే… ఉన్నట్లుండి అమిత్ షా పేరు ప్రస్తావించడం వెనక ఆంతర్యం ఏంటా అనే చర్చ జరుగుతోంది. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారని… అందుకే ఇప్పుడు వాళ్ల గురించి టాపిక్ తెస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న జనసేన.. 151 స్థానాల్లో విజయం సాధించి అధికారంలో ఉన్న వైసీపీపై విమర్శలతో విరుచుకుపడుతుంది. నిత్యం పదునైన మాటలతో.. వైసీపీని విమర్శిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్.. చేసిన కామెంట్స్ మరింత హీట్ పెంచాయి. ప్రస్తుతం ఉన్న దేశ రాజకీయాలకు మోదీ, అమిత్ షా వంటి వ్యక్తులే కరెక్ట్ అని, అలాంటి వారే అన్యాయాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తారంటూ పవన్ కామెంట్ చేశారు.

 

ఆ భయం వీళ్లకు ఉందని, అందుకే వాళ్ళను చూసి భయపడుతున్నారంటూ వైసీపీని టార్గెట్ చేశారు. ఏదేమైనా… ఏపీలో జనసేన ఒంటరిగానే ఉంటుందా.. లేక బీజేపీతో దోస్తీ కడుతుందా లేదంటే కమలదళంలో విలీనమవుతుందా… కాలమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు.
Read More : ప్రకాశంలో దారుణం : తల్లి, పసిపాపను తగులబెట్టారు