Chandrababu Pawan Kalyan Meeting : ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. దాదాపు గంటన్నర సేపు ఇరువురూ సమావేశం అయ్యారు. తాజా రాజకీయాలతో పాటు ఇతర అంశాలపై మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీ అనంతరం సచివాలయం నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయారు పవన్ కల్యాణ్.
డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ తొలిసారి సచివాలయం వెళ్లారు. పవన్ కల్యాణ్ కు సీఎం చంద్రబాబు సాదరంగా స్వాగతం పలికారు. పవన్ ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు చంద్రబాబు. ఆ తర్వాత ఇరువురూ సమావేశం అయ్యారు. సుమారు గంటన్నర సేపు వీరి భేటీ నడిచింది. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి వచ్చిన పవన్.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవడం ఆసక్తికరంగా మారింది. గంటన్నర పాటు జరిగిన సమావేశంలో వీరిద్దరూ ఏయే అంశాలపై చర్చించుకున్నారు అనేది ఉత్కంఠ కలిగించింది.
కాగా, తాజా రాజకీయాలపైనే ఇరువురూ డిస్కస్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే, తన శాఖలకు సంబంధించి ఏం చేయాలి? ఏ విధంగా ముందుకు వెళ్లాలి? అన్నదానిపై చంద్రబాబుతో పవన్ చర్చించినట్లుగా సమాచారం. తనకు పాలనపై అనుభవం లేకపోవడంతో పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ కల్యాణ్ కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు సీఎం చంద్రబాబు ఓకే చెప్పారని, తనవైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.
ఎన్నికల్లో జనసేన కేడర్ కూడా చాలా కష్టపడి పని చేసిందని, ఈ నేపథ్యంలో నామినేటేడ్ పోస్టుల్లో తమకు కూడా కొన్ని కేటాయించాలని, తమకు కూడా కొంత న్యాయం చేయాలని చంద్రబాబును పవన్ కల్యాణ్ రిక్వెస్ట్ చేసినట్లుగా సమాచారం. అందుకు చంద్రబాబు సమ్మతించినట్లుగా తెలుస్తోంది. అలాగే డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ అడక్కముందే చంద్రబాబు ఆ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మండలి బుద్ధప్రసాద్ లేదా మాధవికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. వీరిద్దరిలో ఆ పదవి ఎవరికి ఇవ్వాలన్న చాయిస్ ను పవన్ కల్యాణ్ కే వదిలేశారట చంద్రబాబు.
Also Read : ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్