ఏపీలో నేడు లక్షా 8,230 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ
- bheemraj
- Published On : December 30, 2020 / 07:34 AM IST
Distribution of house deeds to beneficiaries : ఏపీ సీఎం వైస్ జగన్ ఇవాళ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విజయనగరం గుంకలాలంలో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఉదయం 11 గంటల 15 నిమిషాలకు సభా వేదిక వద్దకు సీఎం చేరుకుంటారు.
అనంతరం ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించిన పైలాన్ ఆవిష్కరిస్తారు. అక్కడే లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.
విజయనగరం జిల్లా వ్యాప్తంగా మొత్తం ఒక లక్షా 8 వేల 230 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తోంది. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు 65 వేల 026 మంది, పట్టణ ప్రాంతాలకు చెందినవారు 43 వేల 204 మంది లబ్ధిదారులు ఉన్నారు.
పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం మొత్తం 11 వందల 64 లే అవుట్లను సిద్ధం చేసింది. వీటిని అభివృద్ధి చేసేందుకు 10 కోట్ల 19 లక్షల రూపాయలు ఖర్చు చేసింది.
