Durga Prashanthi Case: చిత్తూరు (Chittoor) జిల్లా వేలూరు రోడ్డులోని కొండమిట్ట ప్రాంతంలో వారం రోజుల క్రితం జరిగిన బ్యూటీషియన్ దుర్గా ప్రశాంతి హత్య కేసు (Durga Prashanthi Case) లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. వారం రోజుల క్రితం అక్కడ ప్రశాంతి, చక్రవర్తి రక్తపు మడుగులో కనపడిన విషయం తెలిసిందే. యువతి ప్రశాంతి మృతి చెందగా, చక్రవర్తి గాయాలతో బయటపడ్డాడు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఇవాళ మీడియాకు పూర్తి వివరాలు తెలిపారు.
డీఎస్పీ బాబు ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమ వ్యవహారమే దుర్గా ప్రశాంతి మరణానికి కారణమని చెప్పారు. తెలంగాణకు చెందిన చక్రవర్తి, చిత్తూరుకు చెందిన దుర్గా ప్రశాంతి ప్రేమించుకున్నారని తెలిపారు. దుబాయిలో వంట మనిషిగా పనిచేసిన చక్రవర్తి కేవలం దుర్గా ప్రశాంతి కోసమే చిత్తూరుకు వచ్చి సెటిల్ అయ్యాడని చెప్పారు.
ఇక్కడ ఒక బ్రెడ్ ఆమ్లెట్ దుకాణం నిర్వహించేవాడని అన్నారు. ప్రియుడు చక్రవర్తి చిత్తూరుకు వచ్చాక దుర్గా ప్రశాంతి మనసు మారిందని పోలీసులు తెలిపారు. చక్రవర్తికి తనకు తగినవాడు కాదని భావించి, మరో యువకుడుతో చనువుగా మెలిగిందని చెప్పారు. ఈ విషయం చక్రవర్తికి తెలిసి దుర్గా ప్రశాంతిని నిలదీశాడని వివరించారు. ఫుట్ పాత్ పై షాపు నడుపుతున్న నీతో పెళ్లికి తన కుటుంబీకులు అంగీకరించరని చక్రవర్తికి దుర్గాప్రశాంతి తెగేసి చెప్పిందని అన్నారు.
దీంతో ఆగ్రహం పెంచుకున్న చక్రవర్తి బ్యూటీ పార్లర్ లో ఒంటరిగా ఉన్న దుర్గా ప్రశాంతితో తొలుత గొడవకు దిగాడని వివరించారు. దుర్గా ప్రశాంతి గొంతునులిమాడని అన్నారు. ఆ తర్వాత తాను తెచ్చుకున్న కత్తితో తన చేతి పైన, మెడ పైన తీవ్రంగా గాయాలు చేసుకున్నాడని తెలిపారు. ఒకవైపు ఊపిరాడని పరిస్థితి, మరోవైపు చిన్ననాటి నుంచి రక్తం అంటే భయపడే దుర్గా ప్రశాంతి షాక్ తో మరణించిందని వివరించారు. నిందితుడు చక్రవర్తిని రిమాండ్ కు తరలించామని అన్నారు.