×
Ad

Devineni Uma Maheswara Rao : రాజమండ్రి జైలులో నాభర్తకు ప్రాణహాని ఉంది- దేవినేని ఉమ సతీమణి

రాజమండ్రి జైల్లో తన భర్తకు ప్రాణహానీ ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు భార్య అనుపమ గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర, రాష్ట్ర హోం మంత్రులకు లేఖలు రాశారు.

  • Published On : July 31, 2021 / 05:55 PM IST

Devineni Uma Maheswara Rao

Devineni Uma Maheswara Rao : రాజమండ్రి జైల్లో తన భర్తకు ప్రాణహానీ ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు భార్య అనుపమ గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర, రాష్ట్ర హోం మంత్రులకు లేఖలు రాశారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా దేవినేని ఉమామహేశ్వరరావు ప్రజా జీవితంలో చాలా క్రియాశీలకంగా ఉన్నారని…అతను సాధారణంగా అవినీతిపరులకు వ్యతిరేకంగా, ప్రత్యేకించి అక్రమ మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడని ఆ లేఖలో పేర్కోన్నారు.

మైనింగ్ మాఫియా, గూండాలు దేవినేని ఉమామహేశ్వరరావును లక్ష్యంగా చేసుకుని, అతని ప్రాణానికి, కుటుంబ సభ్యులకు మరియు ఆస్తి,పాస్తులకు తీవ్రమైన ముప్పు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. దేవినేని ఉమామహేశ్వరరావుపై 27 జూలై 2021 న జి.కొండూరు మండలంలో దాడి జరిగింది. కానీ, ఆయనను అక్రమ కేసులో అరెస్ట్ చేసి, రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు.

గతంలో పోలీసుల అదుపులో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌ జైళ్లలో జరిగిన హత్యా ఉదంతాలను పరిశీలిస్తే, దేవినేని కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, మద్దతుదారులు, అనుచరులు దేవినేనికి ప్రాణ హాని ఉందని భయపడుతున్నారని ఆమె ఆవేదన వెలిబుచ్చారు.

రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌‌ను అకస్మాత్తుగా బదిలీ చేయడం వలన దేవినేని ఉమామహేశ్వరరావు భద్రతపై తీవ్రమైన సందేహాలు, ఆందోళనలు కలుగుతున్నాయని ఆమె అన్నారు. అందువల్ల, రాజమండ్రి సెంట్రల్ జైలులో మైనింగ్ మాఫియా, గూండాల నుండి నా భర్త దేవినేని ఉమామహేశ్వరరావుకు తగిన భద్రత, రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నానని లేఖలో పేర్కోన్నారు.