AP : ముదురుతున్న కొత్త జిల్లాల జగడం
నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీరు మరింత చర్చకు కారణమవుతోంది. ఇప్పుడు జిల్లాల పునర్విభజన అంత అవసరమా అని ప్రశ్నించారు.
- bheemraj
- Published On : February 19, 2022 / 08:11 AM IST
Ap
Formation of new districts : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 2న ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలతో పాటు.. ఆఫీసుల ఏర్పాటుకు భవనాలు గుర్తిస్తున్నారు. కొత్త జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఉన్న ఏరియా ఆసుపత్రులను జిల్లా హాస్పిటల్స్ స్థాయికి పెంచుతున్నారు. ఇదే సమయంలో కొత్త జిల్లాల వ్యవహారం అధికార పార్టీలో వేడి పెంచుతోంది.
నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీరు మరింత చర్చకు కారణమవుతోంది. కొత్త జిల్లాలు ఏర్పడితే వేల కోట్ల నిధులు కావాలన్నారు. ఇప్పుడు జిల్లాల పునర్విభజన అంత అవసరమా అని ప్రశ్నించారు. విభజన వల్ల సోమశిల ప్రాజెక్టు నీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు ఆనం. రాష్ట్ర విభజన ప్రక్రియ తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్ లలో తెలంగాణ, ఆంధ్ర పోలీసులు కొట్టుకున్నట్లు అవుతుందని.. జిల్లా విభజన సమయంలో నీటి లెక్కలు తేల్చాలని కోరారు. లేకుంటే భవిష్యత్తు ఇబ్బంది తప్పదన్నారు.
AP New Districts : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు వేగంగా అడుగులు
అయితే.. ఆనం వ్యాఖ్యలకు వైసీపై నేత నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి కౌంటరిచ్చారు. రావూరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. బాలాజీ జిల్లాకు ఎవరూ వ్యతిరేకంగా లేరని.. ప్రతిపక్షాలు కూడా స్వాగతిస్తున్నాయన్న రాం కుమార్రెడ్డి.. ఆనం ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అందరికీ తెలుసుంటూ కౌంటరిచ్చారు.
