Amaravati: రాజధానికి రాజముద్ర..! రూట్ క్లియర్ అయినట్లేనా? అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల వెనుక వ్యూహం ఇదేనా?
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కొత్త రాజధానిని ఎంచుకోవాలి. 2014 జూన్ 2ను అపాయింటెడ్ డేగా నిర్ణయిస్తూ, రెండు రాష్ట్రాలకు పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పారు.
- Naveen
- Published On : March 26, 2026 / 09:14 PM IST
- అమరావతికి చట్టబద్ధత కోసం ప్రాసెస్ స్పీడప్
- 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో రాజధానిపై తీర్మానం
- ఫ్యూచర్లో ప్రాబ్లమ్ రాకుండా కేంద్రప్రభుత్వం చర్యలు
- ఈ పార్లమెంట్ సెషన్లోనే బిల్లు పెట్టి ఆమోదం తెలిపే అవకాశం
Amaravati: వేల కోట్లతో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం. మిషన్ మోడ్లో పనులు. పెద్ద పెద్ద టవర్లు. ఇంటర్నేషనల్ లెవల్ స్టాండర్డ్స్తో నిర్మాణాలు. ఇలా ఏడాదిన్నరగా అమరావతి అన్స్టాపబుల్ అన్నట్లుగా దూసుకెళ్తోంది. గతానికి మించి కొత్త కలతో కళకళలాడటమే కాదు..సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. కానీ ఒక్కటే బాకీ ఉంది. అదే రాజధాని రాజముద్ర. రాజముద్ర పడితే ఇక నో ప్రాబ్లమ్. ఇటు రైతులు..అటు సీఎం చంద్రబాబు అందరి మదిలో ఉన్నమాట ఇది. ఇందుకోసం కూటమి సర్కార్ చేసిన ప్రయత్నాలన్నీ ఫైనల్ స్టేజ్కు చేరి..అమరావతికి హోదా దక్కేందుకు రూట్ క్లియర్ అవుతోంది.
సడెన్గా ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అంటూ నోటిఫికేషన్..
కూటమి సర్కార్ ప్రెజర్..కేంద్ర ప్రభుత్వ చర్యలు అన్నట్లుగా డెవలప్మెంట్ నడిచింది. కానీ సడెన్గా ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అంటూ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశమై..ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయనుంది. ఆ తీర్మానానికి గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే నోటిఫికేషన్ జారీ కానుంది. దాన్ని కేంద్రానికి పంపించనుంది ఏపీ సర్కార్. ప్రస్తుత పార్లమెంట్ సెషన్లోనే విభజన చట్ట సవరణ బిల్లు పెట్టి..అమరావతిని ఏపీ రాజధానిగా బిల్ పాస్ చేయనున్నారు.
పీఎంవో నుంచి అందిన సూచనల ప్రకారమే చర్యలు..
అయితే రాజధానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపితే చాలు అంటున్నారు. కానీ ఫ్యూచర్లో సమస్యలు రాకుండా ఉండాలంటే అసెంబ్లీలో తీర్మానం చేయడమే బెటర్ అని భావిస్తున్నారట. పీఎంవో నుంచి అందిన సూచనల ప్రకారమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి తీర్మానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారట. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ రాష్ట్ర విభజన చట్టంలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం ఇప్పటికే సానుకూలంగా స్పందించింది. కేంద్రం డౌట్స్ అన్నింటిని క్లారిఫై చేసిన ఏపీ ప్రభుత్వం పూర్తి సమాచారాన్ని అందజేసింది. ఈ క్రమంలోనే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాష్ట్ర విభజన చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం..ఏపీ అసెంబ్లీ నుంచి ప్రత్యేక తీర్మానం కోరినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కొత్త రాజధానిని ఎంచుకోవాలి. 2014 జూన్ 2ను అపాయింటెడ్ డేగా నిర్ణయిస్తూ, రెండు రాష్ట్రాలకు పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే నిర్దేశిత పదేళ్ల కాలం పూర్తయింది. ఈలోపే ఏపీ ప్రభుత్వం కొత్త రాజధాని ఏర్పాటు చేసుకుంది. అయితే దానికి చట్టబద్ధత లేదని అపోహలున్నాయి. 2015 ఏప్రిల్ 23నే అప్పటి ప్రభుత్వం రాజధాని అమరావతి అంటూ జీవో 97ను జారీ చేసింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరిట హైడ్రామా నడిచింది. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చాక..మళ్లీ రాజధాని పనులు స్పీడ్ అయ్యాయి.
భవిష్యత్లో ఎవరు అధికారంలో ఉన్నా..రాజధానిని మార్చడానికి వీళ్లేకుండా చర్యలు
ఈ క్రమంలోనే రాజధాని రైతుల నుంచి ప్రధాన డిమాండ్ ఒకటి వినిపిస్తూ వస్తోంది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే..ఫ్యూచర్కు ఢోకా ఉండదని వాళ్లు సీఎం చంద్రబాబును రిక్వెస్ట్ చేశారు. భవిష్యత్లో ఎవరు అధికారంలో ఉన్నా..రాజధానిని మార్చడానికి వీళ్లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే అమరావతిని రాజధానిగా గుర్తించే చట్టసవరణ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదింపజేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మొన్నటి కేంద్ర క్యాబినెట్ సమావేశంలోనే ఏపీ రాజధాని బిల్లును ఆమోదిస్తారని ప్రచారం జరిగింది. కానీ అసెంబ్లీ తీర్మానం లేకుండా బిల్లును ఆమోదించలేమని కేంద్ర న్యాయశాఖ చెప్పడంతో..లాస్ట్ మినిట్లో పక్కన పెట్టినట్లుగా టాక్ నడుస్తోంది. 28న అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి పంపిన తర్వాత..ఏప్రిల్ 1న కేంద్ర క్యాబినెట్ భేటీలో బిల్లును ఆమోదించి అదే రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఆ తర్వాత రాష్ట్రపతి రాజముద్రతో గెజిట్ రిలీజ్ చేస్తారని అంటున్నారు.
