ఊరిస్తున్న నామినేటెడ్ పదవులు.. చంద్రబాబు ఆశీస్సులు ఎవరికి, తొలి విడతలో ఆ అదృష్టవంతులు ఎవరెవరు?

వాస్తవానికి చంద్రబాబు సీఎంగా ఉండగా నామినేటెడ్‌ పోస్టుల విషయంలో ఎప్పుడూ ఇంత త్వరగా నిర్ణయం తీసుకోలేదు. చంద్రబాబు గత ప్రభుత్వంలో అయితే రెండేళ్ల సమయం తీసుకున్నారు. ఈ కారణంగానే కార్యకర్తలు, నేతలు విసిగిపోయారని... 2019 ఎన్నికల్లో ఓటమికి ఇదీ ఓ కారణమనే చర్చ జరుగుతోంది. దీంతో ఈ సారి జాప్యం లేకుండా త్వరగా నిర్ణయం తీసుకునేలా అడుగులు వేస్తున్నారట చంద్రబాబు.

Gossip Garage : ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం… కూటమి నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మరి అధినేత ఆశీస్సులు ఎవరికి? తొలి విడతలో భర్తీ చేసే పదవులు ఎన్ని? జనసేన, బీజేపీ కోటా మాటేంటి? టీడీపీ పొలిట్‌బ్యూరోలో ఏం చర్చించారు? కూటమి కోఆర్డినేషన్‌ కమిటీ ఏం తేల్చనుంది? పదవుల పందేరంలో కూటమి ప్రాధాన్యతలేంటి?

జనసేన, బీజేపీలకు 40 శాతం పదవులు..!
ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల పందేరానికి సీఎం చంద్రబాబు తెరతీశారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తికావడంతో ముందుగా కొన్ని ముఖ్యమైన నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారట సీఎం చంద్రబాబు. పార్టీ వర్గాల నుంచి రోజురోజుకు ఒత్తిడి పెరుగుతుండటం వల్ల ఒకటి రెండు రోజుల్లోనే తొలి విడత జాబితా విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లు, ఆలయాల ట్రస్టు బోర్డులకు పాలకవర్గాలను నియమించాల్సి వుంది. ఎన్నికల ముందు పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోయిన నేతలకు నామినేటేడ్‌ పోస్టులు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి గతంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ అమలు చేయడంలో భాగంగా కసరత్తు ప్రారంభించారు. జనసేన, బీజేపీలకు 40 శాతం పదవులను కేటాయించాలని భావిస్తున్న చంద్రబాబు.. ఆయా పార్టీలకు ఏయే కార్పొరేషన్లు కేటాయిస్తారనే విషయంపైనే సస్పెన్స్‌ కొనసాగిస్తున్నారు.

తొలి విడతలో పోస్టులు ఎవరెవరికి?
ఎన్నికల్లో జనసేన, బీజేపీలకు కలిపి 31 సీట్లు వదులుకున్న టీడీపీ… ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకున్న నేతలకు నామినేటెడ్‌ పోస్టులు ఆఫర్‌ ఇచ్చింది. వీరిలో కొందరు ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తుండగా, కొందరికి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు కట్టబెట్టాలని భావిస్తున్నారు చంద్రబాబు. ముఖ్యంగా మాజీ మంత్రులు దేవినేని ఉమా, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌వీఎన్‌ వర్మ, కొమ్మాలపాటి శ్రీధర్‌, రామరాజు, ప్రభాకర్‌ చౌదరి, గండి బాబ్జీ వంటి వారు నామినేటెడ్ రేసులో ముందన్నారని అంటున్నారు. ఐతే దేవినేని ఉమా, ఆలపాటి రాజా వంటి వారిని ఎమ్మెల్సీలుగా చేయాలని ప్రతిపాదన ఉందంటున్నారు. దీంతో తొలి విడతలో ఎవరెవరికి పోస్టులు వస్తాయనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్రంట్‌లైన్‌లో పోరాడిన నేతలకు ఎక్కువ ప్రాధాన్యం..!
నామినేటెడ్‌ పోస్టుల భర్తీ విషయంలో సీఎం చంద్రబాబు కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్రంట్‌లైన్‌లో పోరాడిన నేతలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం ఐదురకాల నివేదికలు తెప్పించుకుంటున్నట్లు చెబుతున్నారు. పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన రాబిన్‌శర్మకు చెందిన షోటైమ్‌ కన్సల్టెన్సీ రిపోర్టుతోపాటు పార్టీ ప్రొగ్రామ్స్‌ కమిటీ నివేదికను చంద్రబాబు పరిశీలిస్తున్నారట. పార్టీ కోసం ఎవరెవరు కష్టపడి పని చేసిందీ రాబిన్‌శర్మ టీం రిపోర్టు చేస్తే…. పార్టీ కార్యక్రమాలకు ఎవరు హాజరయ్యే వారు.. ఎవరు ఎగ్గొట్టే వారు…. గత ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో ఎవరు ఎలా ప్రవర్తించే వారన్నది పార్టీ ప్రొగ్రామ్స్‌ కమిటీ నివేదిస్తుందంటున్నారు.

2019 ఎన్నికల్లో ఓటమికి ఇదీ ఓ కారణమనే చర్చ..
ఇక చంద్రబాబు సొంతంగా తయారు చేసిన నివేదిక, ఐవీఆర్‌ఎస్‌ ద్వారా కార్యకర్తల అభిప్రాయాలను సేకరించడం ద్వారా ఫైనల్‌ అయిన పేర్లతోపాటు జిల్లా టీడీపీ అధ్యక్షుల నివేదికను క్రోడీకరించి తుది నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో వీలైనంత తొందరగా ఈ నివేదికలు సిద్ధం చేసి పదవులను భర్తీ చేస్తారంటున్నారు. వాస్తవానికి చంద్రబాబు సీఎంగా ఉండగా నామినేటెడ్‌ పోస్టుల విషయంలో ఎప్పుడూ ఇంత త్వరగా నిర్ణయం తీసుకోలేదు. చంద్రబాబు గత ప్రభుత్వంలో అయితే రెండేళ్ల సమయం తీసుకున్నారు. ఈ కారణంగానే కార్యకర్తలు, నేతలు విసిగిపోయారని… 2019 ఎన్నికల్లో ఓటమికి ఇదీ ఓ కారణమనే చర్చ జరుగుతోంది. దీంతో ఈ సారి జాప్యం లేకుండా త్వరగా నిర్ణయం తీసుకునేలా అడుగులు వేస్తున్నారట చంద్రబాబు.

మూడు కార్పొరేషన్లు జనసేనకు, రెండు బీజేపీకి?
తొలి విడతలో 20 నుంచి 25 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించే అవకాశం ఉందంటున్నారు. ఇందులో మూడు కార్పొరేషన్లు జనసేనకు, రెండు బీజేపీకి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆయా పార్టీలకు ఈ విషయమై సమాచారం పంపారని… డిప్యూటీ సీఎం పవన్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి నుంచి పేర్లు తీసుకుని మొత్తం జాబితా ఒకేసారి విడుదల చేస్తారంటున్నారు. ప్రస్తుతం తొలి విడతలో టీటీడీ చైర్మన్‌, విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయ పాలకవర్గాలతోపాటు కొన్ని కార్పొరేషన్ల చైర్మన్‌ పోస్టులు భర్తీ చేస్తారని…. ఆ తర్వాత విడతల వారీగా నియామకాలు చేపట్టి.. దసరా నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారట చంద్రబాబు. మొత్తానికి అధినేత కసరత్తు మొదలుపెట్టడంతో కూటమి పార్టీల్లో సందడి కనిపిస్తోంది. అదృష్టవంతులు ఎవరు? మరికొన్నాళ్లు నిరీక్షించాల్సిన నేతలు ఎవరన్న చర్చే ఎక్కువగా జరుగుతోంది.

Also Read : విశాఖ వైసీపీలో కలకలం సృష్టిస్తున్న ఆ ఇద్దరు ఎవరు, పార్టీ కార్యక్రమాలంటే వారికెందుకు అంత భయం?

ట్రెండింగ్ వార్తలు