MAVIGUN: మావిగన్ మంత్రం.. రాజధానిపై వైసీపీ ప్లాన్ ఏంటి? ఆ విషయంలో జగన్ సక్సెస్ అయినట్లేనా?

అమరావతికి రాజముద్ర పడటంతో ఇక అన్‌స్టాపబుల్‌ అని కూటమి జోరుగా ప్రచారం చేసుకుంటున్న క్రమంలో.. ఎంటర్ ఆఫ్‌ ది డ్రాగన్ అంటూ..పిక్చర్ అబీ బాకీ హై అన్నట్లుగా ఇండికేషన్ పంపించింది వైసీపీ.

  • Published On : April 9, 2026 / 08:38 PM IST
  • రావాలి జగన్..కావాలి మావిగన్..ఫ్లెక్సీల కలకలం.!
  • మావిగన్ అంటూ జగన్‌ చేసిన ప్రతిపాదనపై విస్తృత ప్రచారం
  • రాజధాని ఎపిసోడ్‌ కంటిన్యూస్ అంటున్న ఫ్యాన్ పార్టీ..!

 

MAVIGUN: తగ్గేదేలే. మావిగనే ఎజెండా. ఎన్ని ట్రోల్స్ జరిగినా లైట్. మరెన్ని విమర్శలు వచ్చినా సీరియస్‌గా తీసకునేదేలే. రావాలి జగన్..కావాలి మావిగన్ అంటోంది వైసీపీ. రాజధాని విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేయని ఫ్యాన్ పార్టీ..మావిగన్‌ స్లోగన్‌ను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే స్కెచ్ వేస్తోంది. రాజధానిపై జగన్‌ నోట వచ్చిన మాటకు..కట్టుబడి ఉన్నట్లుగా చెప్పుకుంటుంది వైసీపీ. క్యాపిటల్‌ ఫైట్‌లో ఫ్యాన్ పార్టీ లెక్కలేంటి? ఎందుకు ఏ మాత్రం వెనకడుగు వేయట్లేదు?

అప్పుడే అయిపోలేదు..ఇంకా మిగిలే ఉంది. ఏపీ రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్‌ ఇలాగే కనిపిస్తోంది. గతంలో అమరావతికి అనుకూలమని చెప్పి..ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల నినాదాన్ని ఎత్తుకుంది వైసీపీ. ఆ స్లోగన్‌ కూడా ఫ్యాన్ పార్టీకి ఎక్స్‌పెక్ట్ చేసిన ఫలితాలను తెచ్చి పెట్టలేదు. 2024లో అధికారం మారిన తర్వాత కూడా ఏపీ రాజధాని అమరావతే అని కూటమి పట్టుబట్టగా..లక్షల కోట్లు..వేల ఎకరాలు..ఒకే చోట అభివృద్ధి చేస్తే ఎలా అంటూ వైసీపీ.. డైలాగ్‌ వార్ కు దిగాయి. ఈ క్రమంలో అమరావతి విషయంలో డిఫరెంట్ వాయిస్ వినిపిస్తూ వచ్చింది జగన్ అండ్ టీమ్.
ఫైనల్‌గా అమరావతికి చట్టబద్ధత కోసం పార్లమెంట్‌లో బిల్లు పెట్టిన రోజు..మావిగన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో వ్యవహారమంతా కొత్త టర్న్ తీసుకుంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి క్యాపిటల్ చేయాలన్న జగన్ ప్రపోజల్‌పై సోషల్‌ మీడియాలో ఫుల్ ట్రోల్స్ నడిచాయి. కూటమి నేతల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ఎక్కడా తగ్గడం లేదు వైసీపీ.

జగన్ ఇంటి ముందు మావిగన్ ఫ్లెక్సీలు..

రాజధాని అంశంలో వెనకడుగు వేసే ముచ్చటే లేదన్నట్లుగా స్ట్రాంగ్‌ వాయిస్ వినిపిస్తోంది. కర్నూల్‌ టు విశాఖ వరకు వరుస పెట్టి వైసీపీ లీడర్లు ప్రెస్‌మీట్లు పెట్టి.. మావిగన్‌ ప్రతిపాదనలో తప్పేముందంటూ కౌంటర్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఇంకో స్టెప్‌ ముందుకేసి రావాలి జగన్‌..కావాలి మావిగన్ అంటూ..పోస్టర్లు, ఫ్లెక్సీలు కూడా వేయించారు. దీంతో క్యాపిటల్‌ ఫైట్‌ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి ముందు వెలిసిన ఫ్లెక్సీలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. వైసీపీ అధినేత ఇంటి ముందు రోడ్డుకు రెండువైపులా పెద్దఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మావిగన్‌కు మద్దతు తెలిపారు. ఫ్లెక్సీలపై కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నేతల ఫొటోలు కూడా ఉన్నాయి.

ప్రజల్లో చర్చ జరిగేలా చేయడంలో వైసీపీ సక్సెస్..!

అమరావతికి చట్టబద్ధత దక్కడంతో సీఎం చంద్రబాబు రాజధాని రైతులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. పైగా ఏపీ క్యాపిటల్‌గా అమరావతికి హోదా దక్కడంతో టీడీపీకి గ్రాఫ్‌ పెరిగే పరిస్థితి కనిపించిందట. అక్కడే వైసీపీ అసలు సిసలు ప్లాన్‌కు తెరలేపిందంటున్నారు. మావిగన్ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చి ప్రజల్లో చర్చ జరిగేలా చేయడంలో వైసీపీ సక్సెస్ అయిందన్న టాక్ వినిపిస్తోంది. అమరావతికి రాజముద్ర పడటంతో ఇక అన్‌స్టాపబుల్‌ అని కూటమి జోరుగా ప్రచారం చేసుకుంటున్న క్రమంలో.. ఎంటర్ ఆఫ్‌ ది డ్రాగన్ అంటూ..పిక్చర్ అబీ బాకీ హై అన్నట్లుగా ఇండికేషన్ పంపించింది వైసీపీ. అంటే అమరావతికి చట్టబద్ధత దక్కడంతోనే రాజధాని ఎపిసోడ్‌ అయిపోలేదు. జగన్ వస్తే ఏదో చేస్తారు అన్న ఊహాగానాలకు తెరలేపింది.

ఓ వైపు కూటమి నేతలు జగన్‌పై దుమ్మెత్తిపోస్తుండగా..అమరావతి బిల్లు అంటూ చర్చ జరిగినప్పుడు వైసీపీ నేతలు డిఫరెంట్ టోన్‌ వినిపించి..ఇప్పుడు సింగిల్‌ లైన్‌ ఎజెండాగా మావిగన్‌ను బలంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ నేతలతో సమావేశమైన సజ్జల రామకృష్ణారెడ్డి మావిగన్‌ స్లోగన్‌ను జనాల్లో చర్చకు పెట్టాలని..జగన్‌ ఎందుకు ఆ ప్రతిపాదన పెట్టారో వివరించాలని దిశానిర్దేశం చేశారు. పైగా మావిగనే ఏపీకి గ్రోత్ ఇంజిన్ అంటోంది వైసీపీ. అంతటితో ఆగకుండా..ఇటు సోషల్‌ మీడియాలో పోస్టులు..అటు పోస్టర్లు, ఫ్లెక్సీలతో సరికొత్త క్యాంపెయిన్‌కు తెరలేపింది.

జగన్ ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో మావిగన్ విషయంలో వైసీపీ గట్టి నిర్ణయమే తీసుకున్నట్లు కనిపిస్తోంది. అమరావతి ఆర్థిక భారమని, ప్లాన్-బి కింద మావిగన్ అన్న పేరును తెరమీదకు తెచ్చి..మంచో చెడో చర్చకు తెరలేపడంలో అయితే వైసీపీ ఎత్తుగడలు ఎంతో కొంత సక్సెస్ అయినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీకి, కూటమి సర్కార్‌కు అనుకున్నంత మైలేజ్‌ రాకుండా..ఫ్యాన్ పార్టీ వ్యూహాలకు తెరదీసినట్లు చర్చ జరుగుతోంది. అందుకే మరో చోట రాజధానిని ఏర్పాటు చేయాలంటూ..కొత్త స్లోగన్ అందుకుని..చర్చకు తెరలేపడమే కాదు..రాజధాని ఇష్యూను కొత్త టర్న్‌ తీసుకునేలా చేశారని అంటున్నారు. ఓవైపు మూడు రాజధానుల మాటేమిటని కూటమి క్వశ్చన్‌ చేస్తుండగా..వైసీపీ మాత్రం ప్లాన్‌-బి మావిగన్‌ అంటూ స్ట్రాంగ్‌ వాయిస్‌ రేజ్ చేస్తోంది. క్యాపిటల్‌ ఫైట్‌లో ఇంకెన్ని ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్స్ ఉంటాయో వేచి చూడాలి.