నిత్యం దాడులు, ఘర్షణలు.. ఉద్రిక్తతలకు కేరాఫ్‌గా మారిన తాడిపత్రి, ఈ పరిస్థితులు మారేది ఎప్పుడు?

ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రతిసారి ఏదో ఒక ఘర్షణతో తాడిపత్రి ప్రజలకు ప్రశాంతత అన్నదే లేకుండా పోయింది. పోలీసులకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది.

Gossip Garage : రీజన్ ఏదైనా రచ్చ కామన్. 40 ఏళ్ల వైరం. ఇప్పుడు రాజకీయ ఆధిపత్య పోరు. బస్తీమే సవాల్ అంటూ తొడగొడుతున్నారు ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు. ఏదో ఒక ఘటనతో ఉద్రిక్తతలకు కేరాఫ్ అయిపోయింది ఆ నియోజకవర్గం. ఒకప్పటి ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతంలో రచ్చ రాజ్యమేలుతోంది. ప్రశాంతతకు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ ఏరియా. లేటెస్ట్ గా జరిగిన ఘర్షణతో ఆ నియోజకవర్గం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. రెండు కుటుంబాల మధ్య వైరంతో ప్రజలు నలిగిపోతున్నారా? అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ఎప్పుడూ ఏదో ఒక రచ్చ జరగడానికి కారణం ఏంటి?

రాజకీయ ఆధిపత్యం కోసం నిత్యం ఘర్షణలు..
తాడిపత్రి అంటేనే కేరాఫ్ హైటెన్షన్. అక్కడ ఎప్పుడూ ఏదో ఒక హడావుడి ఉండనే ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉందన్నది లెక్కే కాదు. ఎవరు పవర్ లో ఉన్నా రచ్చ కామన్. ఒకరిపై ఒకరు రాళ్ల దాడులతో.. పోలీసులతో సహా ఇరువర్గాలు గాయపడటం రెగ్యులర్ అయిపోయింది. నిత్యం ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ డ్డి ఏదో ఒక ఇష్యూతో రచ్చకెక్కుతూనే ఉన్నారు. రాజకీయ ఆధిపత్యం కోసం జరుగుతున్న ఘర్షణలతో.. తాడిపత్రి టాక్ ఆఫ్ ది న్యూస్‌గా ఉంటోంది.

కేతిరెడ్డి, జేసీ కుటుంబాల మధ్య 40ఏళ్ల వైరం..
ఏపీ మొత్తం ఒక ఎత్తు అయితే.. తాడిపత్రి మాత్రం ఆధిపత్య పోరుతో ఉద్రిక్తతలకు కేరాఫ్‌గా ఉంటోంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాల మధ్య నాలుగు దశాబ్దాలుగా వైరం ఉంది. ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవలు జరిగితే.. ఇప్పుడు రాజకీయ ఆధిపత్యం కోసం చూసుకుందామంటే.. చూసుకుందామంటూ టెన్షన్ సిచ్యువేషన్‌కు కారణం అవుతున్నారు ఈ ఇద్దరు నేతలు.

నిత్యం ఏదో ఒక వివాదం..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య నిత్యం ఏదో ఒక వివాదం నడిచేది. అభివృద్ధి విషయంలో అయినా.. తాడిపత్రిలో ఏ కార్యక్రమం జరిగినా సరే ప్రతిరోజు రచ్చ ఉండేది. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుంది. ఇక చిన్నపాటి గొడవ జరిగినా ప్రత్యేక బలగాల మోహరింపు పరిపాటిగా మారింది. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రాలేదు.

వైసీపీ నేత ఇంటికి నిప్పు..
ఎన్నికల మరుసటి రోజు జరిగిన గొడవల కారణంగా మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కొడుకు అస్మిత్‌రెడ్డితో పాటు కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా తాడిపత్రిలోకి రాకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. ఆ తర్వాత ఆంక్షలు సడలించారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి తాడిపత్రిలో నిత్యం పర్యటిస్తున్నారు. కానీ పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వచ్చేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా ఆయనను తాడిపత్రిలోకి రానివ్వలేదు. మంగళవారం రోజు తన స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించారు పెద్దారెడ్డి.

పోలీసులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పెద్దారెడ్డి అతని నివాసానికి వెళ్తారేమోనని తాడిపత్రి భగత్ సింగ్ నగర్‌లో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి దగ్గరకు టీడీపీ నేతలు భారీగా చేరుకున్నారు. పెద్దారెడ్డి ఊరిలో ఉండకూడదని టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో రెండువర్గాల మధ్య రాళ్ల దాడులు జరిగాయి. దీంతో పరిస్థితులు మరోసారి చేయి దాటిపోయాయి. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నడుమ కేతిరెడ్డి పెద్దారెడ్డిని అనంతపురం వైపు తరలించారు. మరోవైపు వైసీపీ నాయకుడు కందిగోపుల మురళి వాహనాలను ధ్వంసం చేశారు. ఇంటికి నిప్పుపెట్టారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు దాడికి యత్నించారు.

తాడిపత్రి ప్రజలకు ప్రశాంతత అన్నదే లేకుండా పోయింది..
ఇంత జరిగినా పెద్దారెడ్డి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పడం వల్లే తనను తాడిపత్రిలోకి రానివ్వడం లేదని.. ఇదే పరిస్థితి అతనికి, అతని కొడుక్కి కూడా వస్తుందని పెద్దారెడ్డి హెచ్చరిస్తున్నారు. వాళ్లు ఎన్ని చేసినా తాను తాడిపత్రికి వస్తానని.. తనను ఆపలేరంటున్నారు. మరోవైపు ఈ ఘటన తర్వాత జిల్లా ఎస్పీ జగదీష్ తాడిపత్రిలోనే మకాం వేశారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం దాడికి గురైన కందిగోపుల మురళి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పెద్దారెడ్డి అనంతపురంలో ఉండిపోయారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి అసలు తాడిపత్రిలో లేరు. ఇవన్నీ చూస్తుంటే పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇలా ప్రతిసారి ఏదో ఒక ఘర్షణతో తాడిపత్రి ప్రజలకు ప్రశాంతత అన్నదే లేకుండా పోయింది. పోలీసులకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది.

 

Also Read : ఎన్నికలకు ముందు ఓ లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క.. పిఠాపురంపై మెగా హీరోల ఫోకస్, ఏం చేయబోతున్నారంటే..

ట్రెండింగ్ వార్తలు