Yanamala Ramakrishnudu – Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ నేతలు భగ్గమంటున్నారు. ఇది అక్రమ అరెస్ట్ అని, రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబుని జైల్లో పెట్టించారని మండిపడుతున్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, జగన్ కు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్ పై ఆయన నిప్పులు చెరిగారు.
జగన్ సీఐడీని తన జేబు సంస్థగా మార్చుకున్నారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు, యువతకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ చర్యలతో ఇకపై ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారు అని యనమల అన్నారు.
”చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు అరెస్ట్ తో నష్టపోయింది ఎవరు? రాష్ట్రంలోని యువత నష్టపోయింది. ఒక జాతీయ నాయకుడు, వరల్డ్ వైడ్ ఫేమస్ లీడర్ ను ఏ విధంగా సంబంధం లేని కేసులో అరెస్ట్ చేశారు. దీని వల్ల నష్టపోయింది రాష్ట్రం. రాష్ట్ర ప్రజలు నష్టపోతారు. రాష్ట్ర యువత నష్టపోతుంది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఏర్పడినటువంటి పరిస్థితులతో మన రాష్ట్రంలో ఎవరూ కూడా పైసా పెట్టుబడి పెట్టరు. ఇప్పటికే ఏపీలో ఎవరూ పెట్టుబడులు పెట్టలేదు. ఇక, భవిష్యత్తులో ఎవరూ మనవైపు చూడరు. ఎవరూ పెట్టుబడులు పెట్టకపోతే నష్టపోయేది ఎవరు? యువత నష్టపోతారు ముఖ్యంగా. రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు. దీనంతటికి ప్రధానమైన కారణం జగన్ మోహన్ రెడ్డి.
ఈ రాష్ట్రాన్ని ఇప్పటికే నాశనం చేశాడు. జగన్ ఒక నాశనకర్త. రాష్ట్రాన్ని నాశనం చేయడమే కాకుండా యువత భవిష్యత్తుని ఈ తప్పుడు కేసులు ద్వారా తప్పుడు సంకేతాలు పంపించి నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి” అని యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో ఏపీ సీఐడీ చంద్రబాబుని అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబుకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు పోలీసులు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కావడంతో జైల్లో చంద్రబాబుకి ప్రత్యేక వసతులు కల్పించాలని జైలు అధికారులను ఆదేశించారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.