Tirumala Rain : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో మూడుగంటల పాటు ఎడతెరిపి లేకుండా వాన కుమ్మేసింది. జోరు వానతో తిరుమల మాడ వీధులు, రహదారులు పూర్తిగా జలమయం అయ్యాయి. భారీగా గాలులు వీయడంతో అనేక వృక్షాలు నేలకొరిగాయి. శ్రీవారి ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది.
ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంలో భక్తులు తడిసి ముద్దయ్యారు. ఇబ్బందులు పడ్డారు. ఆలయ పరిసరాలు, లడ్డూ వితరణ కేంద్రాల్లో నిలిచిన వర్షపు నీటిని బయటకు పంపేందుకు టీటీడీ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల ఘాట్ రోడ్ లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో మొదటి, రెండో ఘాట్ రోడ్లలో ప్రయాణించే వారిని టీటీడీ సిబ్బంది అప్రమత్తం చేసింది.