AP Cabinet : జగన్ కొత్త కేబినెట్ లో బీసీలకు పెద్దపీట

ఏపీ రాజకీయాల్లో సామాజికవర్గ సమీకరణాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అందుకే కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణలో కులాల వారీగా ఇబ్బంది రాకుండా సీఎం జగన్‌ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Ap Cabinet (3) (1)

AP new cabinet : ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణకు సర్వం సిద్ధమైంది. ఎల్లుండి ఉదయం 11 గంటల 31 నిమిషాలకు కొత్త కేబినెట్‌ కొలువుదీరనుంది. కొత్త మంత్రులతో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఇందుకోసం పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త మంత్రుల జాబితా రేపు మధ్యాహ్నం కల్లా సిద్ధం కాబోతోంది. సీఎంవో అధికారులు ఈ లిస్ట్‌ను తీసుకుని గవర్నర్‌ విశ్వభూషణ్‌ దగ్గరకు వెళ్తారు. ఆ తర్వాత కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోబోయే వారికి సీఎం జగన్‌ స్వయంగా ఫోన్‌ చేసి ఆ విషయం చెప్పబోతున్నారు. మరోవైపు మంత్రివర్గంలో చోటు ఖాయమని నమ్ముతున్న చాలామంది నేతలు.. ఇప్పటికే కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ చేరుకున్నట్లు తెలుస్తోంది.

ఏపీ రాజకీయాల్లో సామాజికవర్గ సమీకరణాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అందుకే కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణలో కులాల వారీగా ఇబ్బంది రాకుండా సీఎం జగన్‌ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త కేబినెట్‌లోకి బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. బీసీల నుంచి ఏకంగా 9మందికి అవకాశమిచ్చినట్లు సమాచారం. ఇక సీఎం జగన్‌ సొంత సామాజికవర్గమైన రెడ్ల నుంచి ముగ్గుర్ని మాత్రమే కేబినెట్‌లోకి తీసుకుంటారని టాక్ నడుస్తోంది. కాపుల నుంచి ముగ్గురు మంత్రులు ఉంటారని తెలుస్తోంది. ఇక కమ్మల నుంచి ఒకర్ని.. మైనారిటీ వర్గం నుంచి ఒక్కరి తీసుంటారని తెలుస్తోంది. ఎస్సీల నుంచి ఆరుగురు మంత్రుల్ని.. ఎస్టీ సామాజికవర్గానికి చెందిన ఇద్దర్ని జగన్‌ ఫైనలైజ్‌ చేసినట్లు సమాచారం.

AP Cabinet : నేడు రాజ్‌భవన్‌కు పాత మంత్రుల రాజీనామాలు.. రేపు గవర్నర్‌కు కొత్త మంత్రుల జాబితా

గత కేబినెట్‌లో నలుగురు రెడ్లకు ఛాన్స్‌ ఇవ్వగా.. ఈసారి ముగ్గుర్నే తీసుకుంటున్నారు. గతంలో నలుగురు కాపులుండగా.. ఈసారి ముగ్గురికే ఛాన్స్‌ ఇస్తున్నారు. గతంలో ఏడుగురు బీసీలుంటే.. ఈసారి ఏకంగా 9 మంది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇక గత కేబినెట్‌లో ఒకరే ఎస్టీ ఉంటే.. ఈసారి ఇద్దరికి అవకాశం ఇస్తున్నారు. ఎస్సీల నుంచి గతంలో ఐదుగురుంటే ఈసారి ఆరుగురికి ఛాన్స్‌ దక్కినట్లు తెలుస్తోంది. కమ్మ, మైనారిటీలకు గతంలో లాగానే ఈసారి కూడా ఒక్కొక్కరికే అవకాశమిచ్చారు సీఎం జగన్‌. ఈసారి క్షత్రియ, వైశ్యులకు మంత్రులుగా అవకాశం లేనట్లే అంటున్నారు.