×
Ad

Hindupuram MLA Nandamuri Balakrishna : టీచర్‌గా మారిన బాలకృష్ణ.. దానికి దూరంగా ఉండాలని విద్యార్థులకు హెచ్చరిక

సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొత్త అవతారం ఎత్తారు. టీచర్ గా మారారు. తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్న బాలయ్య.. పాఠశాలలకు ఎల్ఈడీ టీవీలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు.

  • Published On : August 18, 2022 / 07:39 PM IST

Hindupuram MLA Nandamuri Balakrishna : సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొత్త అవతారం ఎత్తారు. టీచర్ గా మారారు. తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్న బాలయ్య.. పాఠశాలలకు ఎల్ఈడీ టీవీలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు.

టీచర్ గా మారిన బాలయ్య తనదైన స్టైల్ లో క్లాస్ కూడా తీసుకున్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియా వైపు వెళ్లకండి.. ఫేస్‌బుక్‌ చూస్తూ కాలం వృథా చేయకుండి అంటూ విద్యార్థులకు సూచించారు. మంచి సందేశాన్నిచ్చే సినిమాలను చూడాలన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు, దేశానికి గుర్తింపు తెచ్చే విధంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాక్షించారు బాలయ్య. హిందూపురంలో అంధుల పాఠశాలను, నవోదయ విద్యా సంస్థను తెచ్చిన ఘనత ఎన్టీ రామారావుకి దక్కుతుందన్న ఆయన.. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు.

”ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో ఎన్నో విద్యా సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత టీడీపీది. వైసీపీ ప్రభుత్వం అనాలోచిన చర్యలతో విద్యావ్యవస్థ ప్రమాదంలో పడింది. విద్యార్థులు సోషల్ మీడియాపై ఆసక్తి చూపొద్దు. పిల్లల క్రమశిక్షణపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి” అని బాలయ్య అన్నారు.

నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గ పర్యటనలో బిజీగా ఉన్నారు. తన నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలని సంకల్పించిన బాలయ్య.. అందరికీ ఉచితంగా వైద్య‌ సేవ‌లు అందుబాటులో ఉండేలా ఎన్టీఆర్ ఆరోగ్య ర‌థం పేరుతో త‌యారు చేసిన ప్ర‌త్యేక బ‌స్సును ప్రారంభించారు. ఇక రెండో రోజు సైతం ఆయన పర్యటన కొనసాగుతోంది.

తన తొలిరోజు పర్యటనలో.. అందరికీ ఉచితంగా వైద్య‌సేవ‌లు అందుబాటులో ఉండేలా ఎన్టీఆర్ ఆరోగ్య ర‌థం పేరుతో త‌యారు చేసిన ప్ర‌త్యేక బ‌స్సును ప్రారంభించారు బాలయ్య. హిందూపురం మండలం చలివెందులలో ఈ ఆరోగ్య రథాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ మొబైల్ వాహనం ద్వారా నియోజకవర్గ ప్రజలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్యసేవలు అందిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ ఆరోగ్య రథం ద్వారా ప్రత్యేక వైద్యబృందం వైద్య పరీక్షలు, ఉచిత వైద్యం అందిస్తుందని వెల్లడించారు.