Hot Summer : వడదెబ్బతో 19 మంది మృతి.. తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు..
Heat Wave : ఈ నెల 29వరకు ఎండలు దంచికొడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయువ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావంతో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
- Naveen
- Published On : May 19, 2023 / 05:35 PM IST
Heat Wave
Hot Summer – Telugu States : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఏపీ, తెలంగాణ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న పగతిపూట ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఓవైపు ఉక్కపోత, మరోవైపు వడగాల్పులు.. జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బతో వేర్వేరు ప్రాంతాల్లో 9మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు అన్ని జిల్లాల్లో సగటున 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా జిల్లాల్లో మధ్యాహ్నం పూట రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా నిడమనూరులో 45.9, కరీంనగర్ జిల్లా తనకల్లులో 45.6, భద్రాద్రి జిల్లా గరిమెళ్లపాడు, సూర్యాపేట జిల్లా గీతవారిగూడెం, కరీంనగర్ జిల్లా వీణవంకలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే మూడు నుంచి 5 డిగ్రీల వరకు అదనపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 44.8, జగిత్యాల జిల్లా ధర్మపురి, భద్రాద్రి జిల్లా పాల్వంచలో 44.5, అశ్వాపురం, జగిత్యాల జిల్లా వెల్గటూరులో 44.3, సారంగపూర్, మంచిర్యాల జిల్లా జన్నారం, నిర్మల్ జిల్లాలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, హైదరాబాద్ లో 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. రానున్న 4 రోజుల పాటు నగరంలో ఎండల తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
రాష్ట్రంలో వడదెబ్బతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. నిన్న 9మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో అన్ని వయసుల వారు ఉన్నారు. గద్వాలలో ఒక కారు దగ్దమైంది.
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో అధిక ఉష్ణోగ్రతలకు ఒక కారు మంటల్లో కాలిపోయింది. ప్రకాశం జిల్లా గుండ్లపల్లిలో అత్యధికంగా 46.49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బకు 10మంది చనిపోయారు.
వాయువ్య దిశ నుంచి రాష్ట్రంవైపు తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావంతో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 29 వరకు ఎండలు దంచికొడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం వేళలో 40 నుంచి 43 డిగ్రీల మధ్య.. మధ్యాహ్న వేళలో 44 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు బయట తిరగొద్దని చెప్పింది. అత్యవసరం అయితేనే బయటకు రావాలని, అదీ జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాలంది.
