House plots distribution in Anantapur district : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ‘అనంత’ లబ్ధిదారులు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి లబ్ధిదారులకు కొడిమి లేఔట్లో ఆదివారం ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది.
అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులు తమకు కేటాయించిన ప్లాట్ల వద్ద ‘థ్యాంక్యూ జగనన్న’ అని అక్షరాలుగా నిలబడి ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ సొంతిళ్లు లేక అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడ్డామని, సీఎం జగన్ తమను ఓ ఇంటి వాళ్లుగా చేశారని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు, ఇంత మంచి ప్రాంతంలో ఇంటి స్థలాలను అందించినందుకు ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. లేఔట్లోని ప్రతి ప్లాట్ వద్దకు స్వయంగా వెళ్లి పట్టాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అనంత అందజేశారు.
క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పర్వదినాన రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి సీఎం జగన్ తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో శ్రీకారం చుట్టారు. ఈ పధకం ద్వారా రాష్ట్రంలో కోటి 24 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది.