సరిగ్గా 20ఏళ్ల తర్వాత.. బుడమేరు దెబ్బకు మునిగిన విజయవాడ.. ఇది ఎవరి పాపం?

2005 సెప్టెంబర్ లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. విజయవాడ మూడొంతులు ముంపునకు గురైంది.

Budameru Floods : విజయవాడ జలవాడగా మారింది. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత బుడమేరు వరద నగరాన్ని ముంచెత్తింది. ఎటు చూసినా నీటితో నిండిన బెజవాడ సముద్రాన్ని తలపిస్తోంది. విజయవాడ నగరం మధ్య నుంచి ప్రవహించే బుడమేరు ఇంతలా ఉగ్రరూపం దాలుస్తుందని ఎవరూ ఊహించలేదు. 20 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా వచ్చిన వరదతో జనం అతలాకుతలం అవుతున్నారు. వాగులు, వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని బుడమేరు నిరూపించింది.

20 ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్దాంతరంగా నిలిచిపోవడంతో ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బుడమేరు ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయని చెబుతున్నారు. విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణా నది కంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతో దశాబ్దాలుగా ముంపు ప్రమాదం పొంచి ఉంది. 2005లో చివరిసారి బుడమేరు బెజవాడను ముంచేసింది.

2005 సెప్టెంబర్ లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. విజయవాడ మూడొంతులు ముంపునకు గురైంది. వరదల కారణంగా విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. బుడమేరు ఉగ్రరూపంతో ప్రవహించడమే ఇందుకు కారణమైంది. రికార్డ్ స్థాయిలో ఎగువున ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో విజయవాడను ముంచెత్తింది.

ఖమ్మం జిల్లాలో పుట్టే బుడమేరు ఏటా సాధారణ సీజన్ లో గరిష్టంగా 11 వేల క్యూసెక్కుల ప్రవాహంతో ప్రవహిస్తుంది. 2005లో అది 70వేల క్యూసెక్కులకు చేరింది. బుడమేరు ప్రవాహాన్ని నియంత్రించడానికి వెలగలేరు వద్ద ఓ రెగులేటర్ ను 70వ దశకంలో నిర్మించారు. వెలగలేరు మీదుగా ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ రూరల్ మీదుగా నగరంలోకి ప్రవేశిస్తుంది. 2005లో వచ్చిన వరదలకు కారణాలను వివరిస్తూ సీపీఐ అనుబంధ రైతు సంఘం నాయకుడు కొల్లి నాగేశ్వరరావు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

బుడమేరు ముంపునకు శాశ్వత పరిష్కారం చూపకపోతే కృష్ణా జిల్లాకు ఎప్పటికీ ముంపు పొంచి ఉంటుందని ఆందోళనకు దిగడంతో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి స్వయంగా విజయవాడ వచ్చారు. విజయవాడలో ఉన్న వరద పరిస్థితి మొత్తాన్ని ఇరిగేషన్ అధికారులు వైఎస్ఆర్ కు వివరించారు. బుడమేరు ప్రవాహాన్ని కట్టడి చేయాలంటే దాన్ని మళ్లించడం ఒక్కటే మార్గం అని భావించారు. పోలవరం ప్రాజెక్ట్ లో భాగంగా గోదావరి జలాలను కుడి కాలువ ద్వారా కృష్ణా నదిలో కలిపే డిజైన్ అప్పటికే ఖరారైంది.

బుడమేరు ప్రవాహానికి దిగువున పోలవరం కుడి కాలువ కృష్ణా నదిలో గుర్తించి అలైన్ మెంట్ లో మార్పులు చేయాలని అధికారులకు అప్పటి సీఎం వైఎస్ఆర్ సూచించారు. విజయవాడ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బుడమేరు మలుపులు సరి చేసి నీటి ప్రవాహం నేరుగా కొల్లేరుకు చేరేలా చూస్తామని, వరదల్లో నీటి ప్రవాహం వెనక్కి రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

 

Also Read : 10 నిమిషాల వర్షానికే నదుల్లా కాలనీలు.. బెజవాడ మునిగింది అందుకేనా? ఇక్కడా బుల్డోజర్ దిగాల్సిందేనా?

ట్రెండింగ్ వార్తలు