Srisailam And Jurala Projects : ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో తెలుగు రాష్ట్రాలకు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. కర్నాటకలో వర్షాలు కురుస్తుండటంతో.. కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. వరద నీటితో జూరాల ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుండగా.. శ్రీశైలం ప్రాజెక్టుల్లోకి ఇన్ ఫ్లో మొదలైంది. నారాయణపూర్ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు, వర్షాల కారణంగా జూరాలకు వరద నీరు పెరుగుతోంది.
జూరాలలోకి 20 వేల 239 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా.. 7 వేల 484 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 318.420 మీటర్ల ఎత్తులో నీళ్లున్నాయి. క్రమంగా వరద నీరు వస్తుండటంతో.. రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది.
శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద మొదటిసారి శ్రీశైలం డ్యామ్కు చేరింది. శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద నీరు పెరుగుతోంది. జూరాల నుంచి 5 వేల 233 క్యూసెక్కులు, సుంకెసుల నుంచి 3 వేల 284 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరుతోంది. ప్రాజెక్టులోకి 12 వేల 169 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రస్తుతం 33.765 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
Read More : Air Force plane: కుప్పకూలిన మిలటరీ విమానం.. 12 మంది మృతి