వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపును విస్తరిస్తూ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం (జులై 16, 2020) నుంచి కర్నూలు, కడప, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీని వర్తింప చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీ సీఈఓ డా.మల్లికార్జున్ సీఎం జగన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరుపై సీఎం ఆరా తీశారు. వెంటనే మరిన్ని జిల్లాలకు ఆరోగ్యశ్రీని వర్తింప చేయాలని ఆదేశించారు.
వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపచేస్తామని ఎన్నికల ప్రణాళికలో జగన్ హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఈ హామీని అమలు చేయడానికి కసరత్తు ప్రారంభించారు. 2020 జనవరి 3న పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ప్రాజెక్టుగా చేపట్టారు. పైలట్ప్రాజెక్టులో భాగంగా అప్పటివరకూ ఉన్న 1,059 వైద్య ప్రక్రియలకు, మరో వేయి వైద్య ప్రక్రియలను పెంచి 2,059 రోగాలకు ఆరోగ్యశ్రీని వర్తింపు చేశారు.
అమల్లో వచ్చిన అనేక అంశాలను పరిష్కరిస్తూ ఆరోగ్యశ్రీ పటిష్టంగా అమలుకు విధానాలను రూపొందించారు. అంతేకాదు అమలయ్యే వైద్యప్రక్రియల సంఖ్యను 2,059 నుంచి 2146కూడా పెంచారు. ఆరోగ్యశ్రీ కింద సంపూర్ణ క్యాన్సర్ చికిత్సలో భాగంగా మరో 54 వైద్యప్రక్రియలను కూడా అందిస్తున్నారు. మొత్తంగా 2,200 వైద్య ప్రక్రియలను ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.
గత ప్రభుత్వ పాలనలో కేవలం 1,059 వైద్య ప్రక్రియలకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తింపచేసేవారు. అది కూడా నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లింపులు చేయకపోవడంతో ఆరోగ్యశ్రీ అందని పరిస్థితి. వీటిపై సీఎం ప్రత్యేక దృష్టిపెట్టారు. ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించడంతోపాటు, నెట్వర్క్ ఆస్పత్రులో నాణ్యమైన సేవలకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆరోగ్యశ్రీ బిల్లులను కూడా ఎప్పటికప్పుడు చెల్లించి, మెరుగైన వైద్య సేవలందించేలా నిర్ణయాలు తీసుకున్నారు. 2019 జూన్ నుంచి రూ.1,815 కోట్లు, మరో రూ.315 కోట్లను ఈహెచ్ఎస్ కింద ఈ ప్రభుత్వం చెల్లించింది.