Supreme Court Inquiry on Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పోలవరం ప్రాజెక్ట్పై దాఖలైన పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇచ్చిన అనుమతుల కంటే ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని పెంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాణం చేపడుతోందని ఒడిశా, ఛత్తీస్ఘడ్, తెలంగాణ రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు సమస్యలు వస్తున్నాయని ఆయా రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యక్తులు, సంస్థలు పిటిషన్లు దాఖలు చేశారు.
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అనుమతులకు, ప్రాజక్టు నిర్మాణానికి పొంతన లేదన్న ఒడిశా, ఛత్తీస్ఘడ్, తెలంగాణ రాష్ట్రాలు తమ వాదనను వినిపించాయి. పర్యావరణ అనుమతులపై పునర్ సమీక్ష చేయాలని ఆయా రాష్ట్రాలు సుప్రీంకోర్టును కోరాయి. పోలవరం నిర్మాణం వల్ల భద్రాచలం ఆలయం ముంపునకు గురవుతుందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశాడు. అన్ని పిటిషన్లు కలిపి జస్టిస్ సంజయ్ కిషన్కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించింది.
Polavaram project : పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై ఏపీ,తెలంగాణ మంత్రుల మధ్య ఆరోపణలు
ఈ విషయంలో వాస్తవాలతో కూడిన నివేదిక అందించాలని కేంద్ర జలశక్తి శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయా రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైతే ముఖ్యమంత్రులు, సీఎస్ల స్థాయిలో ఉన్నత స్థాయి చర్చలు జరపాలని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 7కి వాయిదా వేసింది.