Kurnool Bus Accident : కర్నూలులో బస్సు ప్రమాదం.. మృతుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఇదే.. మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు
Kurnool Bus Accident : కర్నూల్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో
- Harishth Thanniru
- Published On : October 24, 2025 / 08:35 AM IST
Kurnool Bus Accident
Kurnool Bus Accident : కర్నూల్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది.
ఉల్లిందకొండ క్రాస్ వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న బైక్ ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో బైక్ బస్సు కిందకు దూసుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. బస్సు డ్రైవర్, రెండో డ్రైవర్ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే, మంటలు ఒక్కసారిగా బస్సు మొత్తం వ్యాపించడంతో బస్సులో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులను అలర్ట్ చేశారు. బస్సు చుట్టూ మంటలు వ్యాపిస్తుండటాన్ని గమనించిన కొందరు ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ల ద్వారా బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు.
బస్సు ప్రమాద సమయంలో 40మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో 20 మంది ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. అయితే, బస్సులోని ప్రయాణికులు ఎక్కువ మంది మెయిన్ డోర్ నుంచి బయటకు పరుగులు తీసేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో డోర్ లాక్ అయిపోయింది. వైర్ కాలి పోవడంతో డోర్ ఓపెన్ అవ్వలేదు దీంతో ప్రయాణీకులు బయటకు రాలేక బస్సులో ఉండిపోయారు. మంటలు వ్యాప్తి పెరగడంతో బస్సులోనే సజీవ దహనం అయ్యారు.
బస్సు పూర్తిగా దగ్దమైంది. 11మంది మృతదేహాలను గుర్తించారు. మరికొందరి మృతదేహాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే, ఈ ప్రమాదంలో మొత్తం 20మంది వరకు మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
ఒకే కుటుంబంలోని నలుగురి మృతి..
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేశ్ సహా నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. గోళ్ల రమేశ్ (35), అనూష (30), మన్విత (10), మనీశ్ (12) మృతి చెందారు. బస్సు ఇంధన ట్యాంకర్ను బైక్ ఢీకొట్టడంతో అగ్నిప్రమాదం జరిగింది.
