Kurnool Police Station: పోలీస్ స్టేషన్లో 105 కిలోల వెండి చోరీ కేసు.. పోలీసులే దొంగలు.. నలుగురి అరెస్టు
మహిళా హెడ్ కానిస్టేబుల్ అమరావతి సహా ఆమె భర్త, బావమరిది, కానిస్టేబుల్ రమణ బాబు పోలీస్ స్టేషన్లో చోరీ చేశారని నిర్ధారణ అయింది. వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
- T Venkateshwarlu
- Published On : April 1, 2023 / 04:16 PM IST
Kurnool Police Station: ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు తాలుకా పోలీస్ స్టేషన్ లో 105 కిలోల వెండి చోరీ కావడం కలకలం రేపింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టి తాలూకా పోలీసులే వెండిని చోరీచేసినట్లు నిర్ధారించారు. ఈ కేసులో మహిళా హెడ్ కానిస్టేబుల్ అమరావతి, కానిస్టేబుల్ రమణ బాబును అరెస్టు చేశారు. 48 గంటల్లో నిందితులను అరెస్టు చేసి సొత్తు మొత్తం రికవరీ చేశామని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ చెప్పారు.
మహిళా హెడ్ కానిస్టేబుల్ అమరావతి, కానిస్టేబుల్ రమణ బాబు సహా చోరీకి సహకరించిన భరత్ సింహా, విజయ భాస్కర్ ను కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. రూ.10 లక్షల నగదు, 81.52 కిలోల వెండి సీజ్ చేసినట్లు చెప్పారు. డీఎస్పీ స్థాయి అధికారితో దర్యాప్తు చేయించామని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తెలిపారు. ఏ స్థాయి అధికారి అయినా సరే క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడితే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అమరావతి, ఆమె భర్త, బావమరిది, కానిస్టేబుల్ రమణ బాబు నలుగురు ప్లాన్ వేసి సొత్తును స్టేషన్ నుంచి తరలించారని చెప్పారు. హార్డ్ క్రిమినల్ విచారణ చేశామని తెలిపారు. ఈ సంఘటన జరగడం బాధకరమని అన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడితే ఎంతటి వారిపై అయినా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి చోరీ ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు.
