Lottery tickets issue in vizianagaram
Lottery tickets issue in vizianagaram: విజయనగరం జిల్లాలో రవాణా శాఖలో లక్కీ లాటరీ టికెట్ల వివాదం రాజుకుంది. పైడితల్లి అమ్మవారి పండగ, విజయనగర ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ చిహ్నంతో ముద్రించిన లాటరీ టిక్కెట్లు కలకలం రేపాయి. ఒక్కో టికెట్ ధర రూ.100 అని, మొత్తం మూడు బహుమతులు ఉంటాయని అధికారులు ప్రకటించినట్లుగా అందులో ఉంది. వాలంటీర్ల ద్వారా విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
జిల్లా అధికారులే లాటరీ టిక్కెట్ల పేరుతో వ్యాపారం చెయ్యడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో వెంటనే టికెట్ల అమ్మకాలను అధికారులు రద్దు చేశారు. జిల్లాలో విజయనగర ఉత్సవాల నిర్వహణ కోసం లాటరీ టికెట్లు విక్రయిస్తున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి ఓ ప్రకటన చేశారు. లాటరీ టికెట్లు నిర్వహించాలని ఏ అధికారికీ టార్గెట్లు నిర్ణయించలేదని, ఎవరికీ ఆదేశాలు జారీ చేయలేదని పేర్కొన్నారు.