Madanapalle Girl Incident
Madanapalle Girl Case : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చిన్నారి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బాలికపై హత్య కేసులో నిందితుడు కులవర్దన్ ఆత్మహత్య చేసున్నాడు. కురబలకోట మండలం కనసానివారిపల్లి దగ్గర చెరువులో నిందితుడి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీయించి.. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడు కులవర్దన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.. అయితే, కులవర్దన్ ఎలా చనిపోయాడన్నదానిపై పోలీసులు విచారిస్తున్నారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణ శివారు నీరుగట్టువారిపల్లిలోని కాట్లాటపల్లి రోడ్డులో నివసిస్తున్న దంపతుల ఏడేళ్ల బాలిక కనిపించకుండా పోయింది. బాలిక రెండో తరగతి చదువుతుంది. సోమవారం సాయంత్రం నుంచి బాలిక ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పొరుగింట్లోనే చిన్నారి మృతదేహం లభించడం కలకలం రేపింది. బాలికపై దారుణానికి వడిగట్టి ఆ తరువాత హత్యచేసి మృతదేహాన్ని నిందితుడు డ్రమ్ములో పడేశాడు.
బాలిక హత్య కేసును ఛేదించే పనిలో నిమగ్నమైన పోలీసులు.. బాలిక కనిపించకుండా పోయిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో ఇంటి పక్కనే నివసించే కులవర్దన్ అనే యువకుడు బాలికను తీసుకెళ్లినట్లు గుర్తించారు. బాలిక ఎదురింట్లో ఉంటున్న కులవర్ధన్ (30)కు నేర చరిత్ర ఉందని తెలియడంతో పోలీసులు అతని ఇంటికి వెళ్లి వెతకగా.. డ్రమ్ములో చిన్నారి విగజీవిగా ఉండటాన్ని గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టంకు తరలించారు.. నిందితుడు కులవర్దన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. బుధవారం ఉదయం కులవర్దన్ చెరువులో శవమై కనిపించాడు.