AP Rains : ఏపీ ప్రజలకు బిగ్‌అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ.. ఈ జాగ్రత్తలు పాటించాలి..

AP Rains : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం, రాత్రి వేళల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

AP Weather

  • ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్
  • పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
  • పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు

AP Rains : ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఇదే సమయంలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ స్థాయిలో ఈదురుగాలులకుతోడు.. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

Also Read : Amaravati Central Secretariat : అమరావతికి మోదీ సర్కార్ వరాలు.. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్.. భారీగా నిధులు..

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం, రాత్రి వేళల్లో విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా అరకు, గజపతినగరం, విజయనగరం, ఎస్.కోట్, కొత్తవలస, చోడవరం, నర్సీపట్నం, మాడుగులలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

తూర్పు గోదావరి, కాకినాడ, విశాఖపట్టణం జిల్లాల్లోనూ ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వర్షాలు పడే సమయంలో, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలకు సూచించారు.

భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు, మత్స్యకారులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.