AP Weather : ఏపీ ప్రజలకు హైఅలర్ట్.. ఈ సమయాల్లో అస్సలు బయటకు రావొద్దు.. బాబోయ్.. ఇవేం ఎండలు సామీ.. సరికొత్త రికార్డులు నమోదు..
AP Weather : ఏపీలో ఎండలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. మాడు పగిలేలా ఎండలతోపాటు ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈనెల 24వ తేదీ వరకు ఏపీలోని కోస్తాలోని అనేక ప్రాంతాలు, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వడగాల్పులు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది.
- Harish Thanniru
- Updated on- May 21, 2026 / 07:57 AM IST
AP Weather
- ఏపీ ప్రజలకు హైఅలర్ట్..
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు
- మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దంటూ హెచ్చరికలు
- ఈనెల 24వ తేదీ వరకు భానుడి భగభగలు
AP Weather : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్నం సమయాల్లో అవసరం అయితే తప్ప బయటకు రావొద్దుని సూచించింది. ఒకవేళ వచ్చినా ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Also Read : Chandrababu Naidu : రోడ్డుపక్కన ఆగి.. తాటి ముంజలు తిన్న చంద్రబాబు, భువనేశ్వరి.. ఫొటోలు వైరల్
ఏపీలో ఎండలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. మాడు పగిలేలా ఎండలతోపాటు ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈనెల 24వ తేదీ వరకు ఏపీలోని కోస్తాలోని అనేక ప్రాంతాలు, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వడగాల్పులు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 45డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం రాష్ట్రంలో ఎండ ఠారెత్తించింది. ఈ వేసవి సీజన్లోనే అత్యధికంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 47.6డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. 11 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ (గురువారం) ఏపీలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలో ఎండ ఉధృతి తీవ్రరూపం దాల్చుతోందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రానున్న నాలుగు రోజులు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ 15 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 13 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రజలు బయలకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉమ్మడి గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం తదితర జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి 47డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.
విజయనగరం, మార్కాపురం జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీలు, శ్రీకాకుళం, విశాఖ, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు రావొద్దని హెచ్చరికలుజారీ చేసింది. ఒకవేళ అత్యవసరమై బయటకు వచ్చినా ప్రజలు ఎండదెబ్బ భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
