CM Chandrababu Naidu
AP Govt : 2026 సంవత్సరంలో ఏపీ ప్రజలకు కొత్త పథకాలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించేలా ప్రణాళికలు చేస్తోంది. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు.
Also Read : LPG Gas Price : కొత్త సంవత్సరం వేళ బిగ్షాక్.. గ్యాస్ సిలిండర్ ధరల్లో భారీ మార్పు.. కొత్త రేట్లు ఇవే..
గురువారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ మీడియాతో మాట్లాడారు. విద్యుత్ రంగంపై తనకున్న అనుభవం, దూరదృష్టితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూశారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన విద్యుత్ పాపాలు నేటికీ ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయని, వైసీపీ ఐదేళ్ల విద్యుత్ విధ్వంస భారాన్ని ప్రభుత్వం, ప్రజలు ఇప్పటికీ భరిస్తూనే ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు మేలు జరిగేలా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు.
విద్యుత్ పెట్టుబడులు ఆకర్షించడం, కేంద్ర పథకాల సమన్వయం, అదనపు కొనుగోళ్లు తగ్గించడం, ఉత్పత్తి పెంచడం వంటి చర్యలతో విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్, పంపడ్ స్టోరేజీ వంటి వినూత్న చర్యలతో అదనపు కొనుగోళ్ల భారం తగ్గించామని చెప్పారు.
AP Minister Gottipati Ravikumar
విద్యుత్ ఛార్జీలు యూనిట్ కు 13పైసలు ట్రూడౌన్ చేసి చరిత్ర సృష్టించామని మంత్రి తెలిపారు. ట్రూఅప్ ఛార్జీల పేరుతో రూ.32,166 కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచి గత వైసీపీ ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచిందని మంత్రి విమర్శించారు. 1999లో ఏపీఈఆర్సీ ఏర్పాటైన నాటి నుంచి ట్రూ డౌన్ అమలు చేసిన తొలి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని చెప్పారు.
ఇప్పుడు తాజాగా అదనపు ట్రూ అప్ ఛార్జీలను భరించేందుకు ప్రభుత్వం సిద్ధపడిందని మంత్రి రవికుమార్ చెప్పారు. విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గించేలా కసరత్తు చేస్తూ భవిష్యత్తులో మరింతగా విద్యుత్ ఛార్జీలు తగ్గించేలా ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం… ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తూ అదనపు భారం పడకుండా చార్జీలు తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుది అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.