Nara Lokesh: జగన్ గెలిచినా రాజధానిని మార్చలేరు- మంత్రి లోకేశ్
అమరావతిపై అబద్దాలు చెప్పిన జగన్.. భూ త్యాగాలు చేసిన రైతులకు క్షమాపణలు చెప్పాలన్నారు. మాయ మాటలు చెప్పి మభ్య పెట్టినందుకే జగన్ ను ప్రజలు 151 నుంచి 11కు పరిమితం చేశారని వ్యాఖ్యానించారు.
- Naveen
- Published On : March 28, 2026 / 07:23 PM IST
Nara Lokesh: అమరావతి ఏకైక రాజధానిగా అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి లోకేశ్ తెలిపారు. అమరావతిపై నేటి తీర్మానం 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు శాశ్వాత పునాది వేసి వారి ఆశలకు రెక్కలు తొడుగుతోందన్నారు. చరిత్రలో నిలిచిపోయే సమావేశం అంటూ జై అమరావతి అని సభలో నినదించారు లోకేశ్. రాజధాని మహిళా రైతులపై నాటి ప్రభుత్వం దాడి దృశ్యాలను సభలో చూపించారు లోకేశ్. ఏపీకి, అమరావతికి జగన్ అనుకూలమో వ్యతిరేకమో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారాయన.
అమరావతిపై కీలక చర్చ జరుగుతుంటే జగన్ బెంగుళూరులో పడుకున్నాడరో లేదా టీవీ చూస్తున్నారో ఆత్మలకే తెలియాలన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదం, అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. అమరావతిపై అబద్దాలు చెప్పిన జగన్.. భూ త్యాగాలు చేసిన రైతులకు క్షమాపణలు చెప్పాలన్నారు. మాయ మాటలు చెప్పి మభ్య పెట్టినందుకే జగన్ ను ప్రజలు 151 నుంచి 11కు పరిమితం చేశారని వ్యాఖ్యానించారు. తమ హక్కుల కోసం ఉద్యమించిన రైతులతో పాటు వారి పోరాటాన్ని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపైనా తప్పుడు కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.
”జగన్ అమరావతి రావాలంటే పరదాలు కట్టుకుని తిరిగేవారు. మహిళలను బూట్లతో తన్నారు. జుట్టు పట్టుకుని లాగారు. భూములు ఇచ్చిన రైతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లారు. అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లును వ్యతిరేకిoచి శాసన మండలిలో బిల్లుని అడ్డుకుoటే మండలి చైర్మన్ పైనే దాడికి యత్నించారు. మండలి చైర్మన్ సంతకం లేకుండానే బిల్లుని గవర్నర్ కు పంపించారు. జగన్ ను చూసిన పారిశ్రామికవేత్తలు ఇప్పటికీ భయపడుతున్నారు. జగన్ మళ్లీ రారని గ్యారెంటీ ఇస్తారా అని అడుగుతున్నారు. జగన్ మరోసారి పొరపాటున కూడా రాకూడదని జనం కోరుకోవాలి” అని మంత్రి లోకేశ్ అన్నారు.
