బీజేపీ-జనసేన పొత్తు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల వరకు ఏపీలో రెండూ పార్టీలు కలిసి పని చేయాలని
బీజేపీ-జనసేన పొత్తు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల వరకు ఏపీలో రెండూ పార్టీలు కలిసి పని చేయాలని నిర్ణయించడం చర్చకు దారితీసింది. బీజేపీ-జనసేన పొత్తుపై వైసీపీ, వామపక్షాలు తీవ్రంగా స్పందించాయి. పవన్ వైఖరిని లెఫ్ట్ పార్టీలు తప్పుపట్టాయి. పవన్ అవకాశవాది అని ఆరోపించాయి. బీజేపీతో జనసేన కలవడాన్ని ఖండించాయి. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని 2019 ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని, అలాంటి పార్టీతో పవన్ పొత్తు పెట్టుకోవడం దారుణం అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే బీజేపీతో కలిశామని పవన్ చెప్పడం ప్రజలను మోసగించడమే అన్నారు.
బీజేపీ-జనసేన పొత్తుపై మంత్రి శంకర్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే టీడీపీ-బీజేపీ పొత్తు కూడా ఉండొచ్చు అన్నారు. చంద్రబాబు తన పార్టీలోని ముఖ్య నేతలను బీజేపీలోకి పంపి బీజేపీతో పొత్తుకు రంగం సిద్ధం చేసుకున్నాడని మంత్రి అన్నారు. బీజేపీ-జనసేన పొత్తుపై ప్రజలకు టీడీపీ ఏం సమాధానం చెబుతుందని ఆయన నిలదీశారు. టీడీపీ, బీజేపీ, జనసేన డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, వాళ్లే బుద్ధి చెబుతారని మంత్రి హెచ్చరించారు. కాగా, పవన్ తో దోస్తీ అంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదడమే అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. బీజేపీ-జనసేన పార్టీలు గత ఎన్నికల్లో పోటీ చేసి పొందిన ఫలితాలు చూశామన్నారు. బీజేపీ-జనసేనలు ఓట్లని, సీట్లని ప్రభావితం చేయలేని పార్టీలని చెప్పారు.
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది. కలిసి పని చేయాలని నిర్ణయించాయి. ఎలాంటి షరతులు లేకుండా కలిసి ముందుకు సాగాలని, ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ-జనసేన డెసిషన్ తీసుకున్నాయి. విజయవాడలో సంయుక్త సమావేశం తర్వాత పొత్తుపై అధికారిక ప్రకటన చేశారు బీజేపీ-జనసేన నేతలు. 2024లో ఏపీలో అధికారమే లక్ష్యంగా బీజేపీ-జనసేన పని చేస్తాయని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
ఏపీకి బీజేపీ అవసరం చాలా ఉందని జనసేనాని పవన్ అన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే రాష్ట్రానికి లాభమన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం బీజేపీతో కలిసి ముందుకెళ్తామన్నారు. జనసేన, బీజేపీ భావజాలం ఒకటిగానే ఉందని.. రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వైసీపీ, టీడీపీ వైఫల్యాలను ఎండగడతామని.. ప్రజా సమస్యలపై కలిసి పోరాడతామని పవన్ చెప్పారు. స్థానిక ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు కలిసి పోటీ చేస్తాయన్నారు. 2024లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల తర్వాత బీజేపీతో కాస్త కమ్యునికేషన్ గ్యాప్ వచ్చిందని పవన్ చెప్పారు.