Botsa Satyanarayana, Nara Lokesh
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు కొనసాగుతున్న వేళ మంత్రి నారా లోకేశ్, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం కొనసాగింది.
నారా లోకేశ్ మాట్లాడుతూ.. “వైసీపీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి తల్లిని అవమానించారు. మహిళలను కించ పరిచే పద్ధతి సరికాదు. సొంత తల్లిని, చెల్లిని గౌరవించడం మీకు చేతకాదు. ఎవరి తల్లిని అటువంటి మాటలు అన్నా, ఏ మహిళను అటువంటి మాటలు అన్నా ఎవరినీ వదిలి పెట్టం. ముందు ముందు మీరు చూస్తారు” అని అన్నారు.
మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. “అంబటి రాంబాబుపై దాడి చేస్తే.. ఆయన కొన్ని మాటలు అన్నారు. ఆ తర్వాత అంబటి రాంబాబు తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు విజ్ఞత కల వ్యక్తి. అందుకే ఆయన క్షమాపణ చెప్పారు. అంబటి రాంబాబు తల్లిని తిడితే ఒకటి… మీ తల్లిని అంటే ఒకటా? తల్లి ఎవరికైనా తల్లే. మీకు అధికారం ఇచ్చింది ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడానికా? మహిళ విషయంలో ఎవరు తప్పు చేసినా తప్పే. అంబటి రాంబాబు తాను చేసిన కామెంట్స్ పై క్షమాపణ చెప్పారు” అని తెలిపారు.
హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. “శాంతి భద్రతలపై చర్చకు మేము సిద్ధం. అంబటి రాంబాబు తల్లిని తిట్టింది ఎవరో ఆధారాలు ఇవ్వండి చర్యలు తీసుకుంటాం. అంబటి రాంబాబు ఓ మాజీ మంత్రి. అలాంటి వ్యక్తి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఎలాంటి సైగలు చేస్తున్నారు? వైసీపీ నేతలకు మాట్లాడటానికి సెన్స్ ఉండాలి” అని అన్నారు.