Nara Lokesh : బుల్లెట్ బండిపై లోకేశ్! ఏపీకి ఎవరొస్తున్నారో తెలుసా..? అంటూ వీడియో రిలీజ్.. 3వేల మందికిపైగా ఉద్యోగ అవకాశాలు..
Nara Lokesh : ఏపీ మంత్రి నారా లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర వీడియోను పోస్టు చేశారు. ఏపీకి ఎవరు వస్తున్నారో తెలుసా? ‘Guess who’s coming to AP?’ అంటూ ప్రశ్నించారు. ఏఐతో రూపొందించిన వీడియోను పోస్టు చేశారు.
- Harish Thanniru
- Updated on- May 7, 2026 / 01:24 PM IST
Nara Lokesh
- ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్
- ఏపీకి ఎవరొస్తున్నారో తెలుసా?
- బుల్లెట్ బండిపై ప్రయాణిస్తున్నట్లుగా ఏఐ వీడియో
Nara Lokesh : ఏపీ మంత్రి నారా లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర వీడియోను పోస్టు చేశారు. ఏపీకి ఎవరు వస్తున్నారో తెలుసా? ‘Guess who’s coming to AP?’ అంటూ ప్రశ్నించారు. లోకేశ్ పోస్టు చేసిన వీడియోలో నీట్గా టక్ వేసుకొని, ట్రెండీ కళ్లజోడు పెట్టుకుని న్యూ లుక్లో రాయల్ ఎన్ఫిల్డ్ (బుల్లెట్) నడుపుతూ లోకేశ్ కనిపించారు. ఈ వీడియో ఏఐ సహాయంతో రూపొందించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఏపీకి మరో భారీ పెట్టుబడి రాబోతుంది అంటూ పేర్కొంటున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం భారీగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా.. తిరుపతిలో రూ.2,508 కోట్ల పెట్టుబడితో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ బుల్లెట్ మోటార్ సైకిళ్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది. తద్వారా 3వేల మందికిపైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. తాజాగా ఇదే విషయాన్ని పేర్కొంటూ లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో వీడియోను పోస్టు చేశారు.
Guess who’s coming to AP? pic.twitter.com/6JvNA15DXS
— Lokesh Nara (@naralokesh) May 7, 2026
మరోవైపు.. ఏపీలోని పలు ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా రిలయన్స్ సంస్థ విశాఖపట్టణంలో రూ.1,08,010 కోట్ల భారీ పెట్టుబడితో ఒక డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుండగా.. శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.51వేలకోట్ల పెట్టుబడితో ఒక సౌర విద్యుత్ ప్లాంట్ను, బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆ సంస్థ యోచిస్తోంది. కడప జిల్లాలో అదానీ సంస్థ రూ.12వేల కోట్ల పెట్టుబడితో ఒక హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది.
