Kondapalli Municipal Panchayat : కొండపల్లి మున్సిపల్ ఎన్నికల వివాదం తుది దశకు చేరింది. కొండపల్లి మున్సిపల్ పంచాయితీలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎంపీ కేశినేని నాని తన ఓటు వేసుకోవచ్చని హైకోర్టు ఆదేశించింది. అయితే అతడి ఓటు పరిగణనలోకి తీసుకోవాలా.. వద్దా.. అన్నది మాత్రం తాము నిర్ణయిస్తామని తెలిపింది. అప్పటి వరకు ఫలితాలు మాత్రం విడుదల చేయవద్దని హైకోర్టు రిటర్నింగ్ ఆఫీసర్ను ఆదేశించింది.
ఇవాళ ఉదయం కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో నాటకీయ పరిణామాలు జరిగాయి. మేయర్ ఎన్నిక జరపాల్సిందేనంటూ టీడీపీ సభ్యులు.. వాయిదా వేయాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు హోరెత్తించారు. కౌన్సిల్ హాల్లో వైసీపీ సభ్యులు గొడవకు దిగడంతో .. ఎన్నికను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. అయితే ఆర్వో తీరును తప్పుబట్టిన టీడీపీ సభ్యులు.. ఎంపీ కేశినేని నాని.. హాల్లోనే బైఠాయించారు. హైకోర్టు రేపు ఎన్నిక నిర్వహించాల్సిందేనని ఆదేశించడంతో.. కౌన్సిల్ హాల్ నుంచి టీడీపీ సభ్యులు బయటకు వచ్చారు.
AP Assembly : కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని ఏపీ అసెంబ్లీ తీర్మానం
కొండపల్లి మున్సిపాలిటీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ 14, టీడీపీ 14 స్థానాల్లో గెలిచాయి. మరో స్థానంలో గెలిచిన ఇండిపెండెంట్ టీడీపీలో చేరడంతో ఆ పార్టీ బలం 15కు చేరింది. ఇక ఎక్స్ అఫీషియో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, టీడీపీ ఎంపీ కేశినేని నాని నమోదు చేసుకున్నారు. దీంతో టీడీపీ బలం 16కు, వైసీపీ బలం 15కు చేరుకున్నాయి. అయితే, కేశినేని నానికి ఆ అర్హత లేదంటోంది వైసీపీ. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ కుర్చీని తామే దక్కించుకుంటామని వైసీపీ చెబుతోంది.