Minister Nimmala ramanaidu
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఆరు గ్రామాల్లో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. జగన్ ఐదేళ్ల అరాచక పాలనలో రాష్ట్రంలోని అన్ని రహదారులు విధ్వంసానికి గురయ్యాయని అన్నారు.
వచ్చే సంక్రాంతి నాటికి గుంతలు లేని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నదే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లక్ష్యమని నిమ్మల చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారంగా ఒకే రోజు రూ.815 కోట్లు చెల్లించిన ఘనత చంద్రబాబుదని తెలిపారు.
సంక్రాంతి కానుకగా పదివేల మంది నిర్వాసితులకు నష్టపరిహారం జమ చేసిన కూటమి ప్రభుత్వమని నిమ్మల చెప్పారు. 2017లో చంద్రబాబు హయాంలోనే నిర్వాసితుల ఖాతాలో 800 కోట్ల రూపాయలు జమ కాగా మళ్లీ నేడు పెద్ద మొత్తంలో జమయ్యాయని తెలిపారు.
పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షల వరకు ఇస్తామని చెప్పి పైసా కూడా ఇవ్వకుండా జగన్ మోసం చేశారని నిమ్మల చెప్పారు. అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టును సందర్శించి నిర్వాసితులకు న్యాయం చేస్తామని చెప్పి నేడు మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు.