6 గంటలు శ్రమించినా ఇంచు కూడా కదలని బోట్లు.. ప్లాన్-సి అమలు చేయనున్న అధికారులు..!

మరోసారి బోట్లను బయటకు తీసేందుకు ప్రక్రియ మొదలుపెట్టనున్నారు అధికారులు.

Prakasam Barrage Boats : కృష్ణా నదిలో చిక్కుకున్న బోట్లను బయటకు తీసే ప్రక్రియ ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంట నుండి బోట్లను నదిలోంచి బయటకు తీసేందుకు రెండు క్రేన్ లతో శ్రమించారు ఇంజనీరింగ్ అధికారులు. 6 గంటల పాటు శ్రమించినా ఇంచు కూడా కదల్లేదు బోట్లు. మరోసారి రేపు ఉదయం బోట్లను బయటకు తీసేందుకు ప్రక్రియ మొదలుపెట్టనున్నారు అధికారులు. రేపు ఉదయం విశాఖపట్నం నుండి ప్రత్యేకంగా డైవింగ్ బృందంతో బోట్లను బయటకు తీయనున్నారు అధికారులు.

Also Read : ఎమ్మెల్యేగా గెలిచినా దక్కని సంతోషం..! ఆ ఇద్దరు వైసీపీ నేతలకు ఏమైంది?

50 టన్నుల భారీ క్రేన్ సాయంతో బోట్ల తొలగింపునకు ప్రయత్నాలు..
ప్రకాశం బ్యారేజీ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియను అధికారులు ఇవాళ ప్రారంభించారు. బ్యారేజ్ 67, 68, 69 గేట్ల దగ్గర నీటిలో చిక్కుకున్న బోట్లను 50 టన్నుల బరువు మోసే భారీ క్రేన్ సాయంతో తొలగించే ప్రయత్నం చేశారు అధికారులు. ఈ నెల 1వ తేదీన ఎగువ నుంచి వచ్చి బ్యారేజీ గేట్ల దగ్గర కౌంటర్ వెయిట్లను బోట్లు ఢీకొని నీటిలో చిక్కుకున్నాయి. వాటిని తొలగించి గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

మధ్యాహ్నం ఒంటి గంట నుంచి బోట్ల తొలగింపు ప్రక్రియ మొదలైంది. 40 టన్నుల బరువు ఉండటంతో బోటును బయటకు తీయలేని పరిస్థితి నెలకొంది. కాగా, గ్యాస్ కట్టర్లతో కట్ చేసి బోటును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు ఎంత తీవ్రంగా శ్రమించినా.. బోటు మాత్రం ఒక్క ఇంచు కూడా కదల్లేదు. బోట్ల తొలగింపు ప్రక్రియలో అధికారులు ప్లాన్ ఏ, ప్లాన్ బీ, ప్లాన్ సీ ప్రణాళికలు వేసుకున్నారు. భారీ క్రేన్ సాయంతో బోటును స్టడీగా చేసి బయటకు తీయడం ఒక ప్లాన్.

అది సాధ్యం కాకపోతే ప్లాన్ బీ ప్రకారం.. గ్యాస్ కట్టర్ల సాయంతో బోటును కట్ చేసి తిప్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఇది కూడా వర్కౌట్ కాలేదని సమాచారం. దీంతో ప్లాన్ సీ పై ఫోకస్ పెట్టారు అధికారులు. ప్లాన్ సీ ప్రకారం.. విశాఖ నుంచి డైవింగ్ బృందం రానుంది. ఈ బృందంలో మొత్తం 10 మంది ఉంటారు. వారు ఆక్సిజన్ మాస్కులతో నదిలోపలికి వెళ్తారు. టెక్నాలజీ సాయంతో బోటును తొలగించే ప్రయత్నం చేయనున్నారని తెలుస్తోంది.

 

 

ట్రెండింగ్ వార్తలు