KethiReddy Venkatarami Reddy – Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం అవుతారా? ముఖ్యమంత్రి కావడానికి ఆయనకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? అంటే, అవుననే అంటున్నారు వైసీపీ నేత, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కేతిరెడ్డి మాట్లాడారు. పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కాకపోయినా రేపైనా పవన్ కల్యాణ్ కు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేతిరెడ్డి అన్నారు. అలా అనడానికి కారణం ఏంటో కూడా చెప్పారు ఎమ్మెల్యే కేతిరెడ్డి.
ఎందుకంటే పవన్ ఇంతవరకు పరిపాలన చేయలేదు కాబట్టి ప్రజలు కూడా ఆయన సీఎం కావాలని ఆశిస్తున్నారు అని కేతిరెడ్డి వివరించారు. అదే సమయంలో పవన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. అధికారంలోకి రాను మరొకరికి సహకరించడానికి నేను ఉన్నాను అని పవన్ కల్యాణ్ అనుకుంటే ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయినట్టే అని హెచ్చరించారు.
‘నువ్వు లీడర్ అవుతానంటే అందరూ నీ వెనుక వస్తారు. మరొకరికి పల్లకి మోస్తాను అంటే నిన్ను అందరిలో ఒకడిగా చూస్తారు. పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఈ పదేళ్ల కాలంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని పవన్ కల్యాణ్ వదులుకున్నారు. చిరంజీవి పార్టీ ప్రారంభించిన 8 నెలల కాలంలో ఎన్నికలకు వెళ్లి 18 సీట్లు అయినా సాధించారు. పదేళ్ల కాలంలో మీరు గెలవలేకపోయారు. మిమ్మల్ని ప్రజలు ఓడించడానికి వివిధ కారణాలు ఉన్నాయి.
మీరు ఏమనుకుంటున్నారో జనాలకు తెలియజేయండి. మీరు అనుకుంటున్నట్టు ఏవైనా ఇబ్బందులు ఉంటే కేసు మీద కేసు వేయండి కోర్టులు ఉన్నాయి కదా. పరిపాలనలో వాలంటీర్ వ్యవస్థ చాలా ఉన్నతమైనది. ఒక వాలంటీర్ ఒక నెల రోజులు సెలవు పెడితే మాకు వాలంటీర్ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయని ప్రజలు మొరపెట్టుకునే పరిస్థితి వచ్చింది.
ఇంట్లో తండ్రీకొడుకులు మాట్లాడుకుంటారో లేదో తెలియదు కానీ వాలంటీర్లు మాత్రం ప్రతి ఇంటికి వెళ్లి వారిని బాగా పలకరించి వస్తున్నారు. వాలంటీర్లకు వైసీపీ అండగా ఉంటుంది. అదే క్రమంలో తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటుంది. వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై డీజీపీ స్పందించాలి. పవన్ ను పిలిపించుకుని ఆయన దగ్గరున్న ఉన్న సమాచారాన్ని సేకరించాలి. తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే లీగల్ గా ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవాలి.
రాష్ట్రంలో సీఎం జగన్ తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ బాగుందని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. అది పవన్ కల్యాణ్ కు కనపడటం లేదా? వాలంటీర్ వ్యవస్థ బాగుంది. కనుకనే చంద్రబాబు నాయుడు 30 ఇళ్లకు క్లస్టర్ ఇంఛార్జిలను నియమిస్తున్నారు. ఎందుకు గతంలో మాదిరి జన్మభూమి కమిటీలను తీసుకొస్తానని చెప్పడం లేదు?” అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు.