Pawan Kalyan : కులమతాల గురించి మాట్లాడేటప్పుడు రాజ్యాంగానికి లోబడి మాట్లాడాలి.. పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ దిశా నిర్ధేశం
చర్చల్లో వ్యక్తిగత విషయాలను గురించి మాట్లాడకపోవడంతో పాటు అవతలి వారి ఆహార్యం గురించో, బాడీ షేమింగ్ చేసే విధంగానో ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడకూడదన్న నియమాన్ని పాటించాలని తెలిపారు.
- bheemraj
- Published On : October 21, 2023 / 06:30 PM IST
Janasena Chief Pawan Kalyan
Janasena Chief Pawan Kalyan : మీడియా సమావేశాలు, టీవీ చర్చల్లో పాల్గొనే పార్టీ అధికార ప్రతినిధులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. మీడియా సమావేశాలు, చర్చల్లో పాల్గొనే అధికార ప్రతినిధులు పార్టీ విధానాలకు కట్టుబడి మాట్లాడాలని సూచించారు. వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు తావు లేదన్నారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతినిధులది గురుతర బాధ్యతని తెలిపారు. ప్రజా పయోగ అంశాలపై బలంగా మాట్లాడాలన్నారు. ఎవరైనా ఒక నాయకుడు ప్రభుత్వ పాలసీలకు ఆటంకం కలిగించినప్పుడు అతని విధానాలు, చేసిన తప్పుల గురించి బలంగా ప్రస్తావించాలన్నారు.
ఈ మేరకు శనివారం ఆయన పార్టీ అధికార ప్రతినిధులతో సమావేశమయ్యారు. మీడియా సమావేశాలు, టీవీ చర్చల్లో పాల్గొనే పార్టీ అధికార ప్రతినిధులకు దేశా నిర్ధేశం చేశారు. కులాలు, మతాల గురించి మాట్లాడవలసినప్పుడు రాజ్యాంగానికి లోబడి మాత్రమే మాట్లాడాలని సూచించారు. అన్ని మతాలను ఒకేలా గౌరవించాలని దేవాలయం, చర్చి లేదా మసీదులపై దాడులు జరిగినప్పుడు ఒకేలా స్పందించాలని పేర్కొన్నారు. ఒక మతం పట్ల ఉదాసీనంగా, మరో మతం పట్ల నిర్లక్ష్యంగా, ఇంకోక మతాన్ని ఎక్కువగా చూడటం వంటి చర్యలకు పాల్పడే నాయకులను, పార్టీలను గట్టిగానే నిలదీయాలన్నారు.
Jogi Ramesh : లోకేష్, చంద్రబాబు ఇద్దరూ దొంగలే : మంత్రి జోగి రమేష్
నిరంతర అధ్యయనం అవసరమని చెప్పారు. ముఖ్యంగా టీవీ చర్చలకు వెళ్లే వారు రాజకీయాలు, సమకాలీన అంశాలు, ప్రజా సమస్యలు మొదలగు ముఖ్యమైన అంశాలన్నింటిపైనా లోతుగా అధ్యయనం చేసి తగిన సమాచారం సిద్ధం చేసుకోవాలని సూచించారు. జనసేన ప్రతినిధుల వల్ల టీవీ చర్చలు ఉన్నత విలువలతో జరిగేలా చర్చను ముందుకు వెళ్ళేలా చూడాలన్నారు. అనవసర విషయాలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి హాని చేసే విధంగా చర్చలు ఉండకూడదని వెల్లడించారు. టీవీల్లో జరిగే చర్చా కార్యక్రమాలు పిల్లలతో సహా కుటుంబ సభ్యులు చూసే అవకాశం ఉన్నందున సంస్కారవంతంగా ఉండాలని పేర్కొన్నారు.
మాట్లాడేటప్పుడు ఎవరి మనోభావాలూ దెబ్బతినకుండా చూసుకోవాలి. చర్చలో పాల్గొనే ఇతరులు మిమ్మల్ని రెచ్చగొట్టినా లేదా తూలనాడినా సంయమనం పాటించాలని పేర్కొన్నారు. ఆ క్షణంలో మనం తగ్గినట్టు కనబడినా ప్రేక్షకులు, సమాజం దృష్టిలో పెరుగుతామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. గతంలో కొన్ని పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ వివిధ కులాలు, మతాలను ఓటు బ్యాంకుగా మలచుకోవడానికి ఎత్తుగడలు వేసేవని, వాస్తవాలు చెబుదామని తెలిపారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల పరిధిలో రూల్ ఆఫ్ లాకి అనుగుణంగా మన మాట, మన ప్రవర్తన ఉండాలన్నారు.
Assembly Elections 2023: ఎన్నికల వేళ.. బీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్యేతో పాటు కీలక నేతలు రాజీనామా
చర్చల్లో వ్యక్తిగత విషయాలను గురించి మాట్లాడకపోవడంతో పాటు అవతలి వారి ఆహార్యం గురించో, బాడీ షేమింగ్ చేసే విధంగానో ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడకూడదన్న నియమాన్ని పాటించాలని తెలిపారు. సోషల్ మీడియాకు అనవసరమైన ఇంటర్వూలు ఇవ్వొద్దన్నారు. కొన్నిసార్లు లేనిపోని అనుమానాలకు తావిచ్చే ప్రమాదం ఉందన్నారు. అదే విధంగా సోషల్ మీడియాలో వచ్చిన ఒక సమాచారాన్ని నిర్ధారించుకోకుండా మరొకరికో లేదా పార్టీ కార్యాలయానికి పంపడమో, దానిపై హడావిడి చేయడం లాంటి చేయొద్దన్నారు.
పార్టీ ప్రతినిధిగా ఉంటూ సోషల్ మీడియాలో వ్యక్తిగత పోస్టులు పెట్టవద్దన్నారు. పార్టీ ప్రతినిధులు కేవలం పార్టీ కోసం మాత్రమే మాట్లాడాలని సూచించారు. మరెవరికో మద్దతుగా మాట్లాడవలసిన అవసరం లేదని చెప్పారు. తన సినిమాలు, కుటుంబ సభ్యులపై వచ్చే విమర్శలపై కూడా స్పందించవద్దన్నారు. అలా స్పందించుకుంటూ వెళ్తే మన లక్ష్యం పక్కదారి పట్టే అవకాశం ఉందన్నారు.
