Petro Chemical Corridor : ఏపీలో పెట్రో కెమికల్ కారిడార్, 50లక్షల మందికి ఉద్యోగాలు

వీలైనంత త్వరలో రాష్ట్రంలో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటు కానుందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. పెట్రో కెమికల్ కారిడార్‌తో రాష్ట్రంలో 50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.

  • Updated on- June 16, 2021 / 06:18 PM IST

Petro Chemical Corridor

Petro Chemical Corridor : వీలైనంత త్వరలో రాష్ట్రంలో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటు కానుందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. పెట్రో కెమికల్ కారిడార్‌తో రాష్ట్రంలో 50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు.

మంత్రి వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావన సక్సేనా ఉన్నారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనతో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటు దిశగా కేంద్రం ముందడుగు వేస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పెట్రోలియం సెక్రటరీలు చర్చించి ఈ అంశంపై ఒక ప్రణాళిక రూపొందిస్తారని ఆయన చెప్పారు.

కేంద్రమంత్రితో భేటీ సందర్భంగా కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్ ఏర్పాటుపై గౌతమ్ రెడ్డి చర్చించారు. రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ ఏర్పాటుతో ఇథనాల్ ఉత్పత్తికి కేంద్రం సుముఖత తెలిపిందన్నారు. ఇథనాల్ ఉత్పత్తి ప్లాంట్లకు వెయ్యి కోట్లు కేటాయిస్తామని మంత్రి చెప్పారు.

”కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్ ను వెంటనే ప్రారంభించాలని కోరాం. పెట్రో కెమికల్ కారిడార్ కు కేంద్రం సానుకూలంగా ఉంది. పెట్రో కెమికల్ రిఫైనరీకి రూ.32వేల కోట్లు కావాలి. విశాఖ ఉక్కు పరిశ్రమ అంశంపైనా చర్చించాం. రాష్ట్రానికి రావాల్సిన ఇతర అంశాల గురించి కూడా కేంద్రమంత్రితో చర్చించాం” అని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు.