Petrol Bunk Timings : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆ సమయాల్లో పెట్రోల్ బంకులు బంద్.. రోజుకు 16గంటలే..?
AP Petrol Bunk Timings : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పొదుపు చర్యలకు తమ వంతు మద్దతుగా నిలిచేందుకు ఏపీపీఎఫ్టీ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెట్రోల్, డీజిల్ బంకుల నిర్వహణ సమయాలను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పరిమితం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
- Harish Thanniru
- Updated on- May 16, 2026 / 02:13 PM IST
Petrol Stations In Ap To Operate Only From 6 Am To 10 Pm
AP Petrol Bunks: పశ్చిమాసియాలో నెలకొన్న ఉధ్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన కొరత వేదిస్తోంది. భారతదేశంలోనూ పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. హర్మూజ్ జలసంధి వద్ద నౌకలరాకపోకలు నిలిచిపోవడంతో భారతదేశంకు ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇటీవల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరతతో పలు ప్రాంతాల్లో బంకులు మూతపడ్డాయి. ప్రస్తుతం ఆ పరిస్థతుల నుంచి కాస్త తేరుకున్నా.. రానున్న రోజుల్లో ఇంధన కొరత తీవ్రమవుతోందని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు.
Also Read : PM Narendra Modi : నెదర్లాండ్స్లో నరేంద్ర మోదీకి ఘన స్వాగతం.. ఫిదా అయిన ప్రధాని.. ఫొటోలు వైరల్
ప్రజలు సొంత వాహనాల వాడకాన్ని తగ్గించి ప్రజారవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని, కార్ పూలింగ్ విధానాన్ని, ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు తగ్గుముఖం పట్టేవరకు ప్రజలు పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని కోరారు. ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు ఏపీ ప్రభుత్వం పొదుపు చర్యలను పాటిస్తుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబునాయుడు తోపాటు మంత్రి నారా లోకేశ్, ఇతర మంత్రులు తమ కాన్వాయ్లోని వాహనాలను తగ్గించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం ట్రేడర్ల సమాఖ్య (APPFT) కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పొదుపు చర్యలకు తమ వంతు మద్దతుగా నిలిచేందుకు ఏపీపీఎఫ్టీ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెట్రోల్, డీజిల్ బంకుల నిర్వహణ సమయాలను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పరిమితం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అత్యవసర సేవల వాహనాలకు (అంబులెన్సులు, పోలీస్ వాహనాలు మొదలైనవి) మాత్రం ఎల్లప్పుడూ ఇంధనం అందుబాటులో ఉంచుతామని సమాఖ్య స్పష్టం చేసింది.
సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రవి గోపాలకృష్ణ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం పౌరసరఫరాల శాఖ కమిషనర్ ను కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే ఇక నుంచి ఏపీలో పెట్రోల్ బంకులు ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.
