Pawan Kalyan Meets Modi : విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. 35 నిమిషాల పాటు వీరి సమావేశం సాగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రెండు పార్టీలు కలిసి పని చేయడంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధానితో భేటీలో పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రి ఏపీ టూర్ కు వచ్చారు. వర్షం కారణంగా ఆయన ప్రయాణిస్తున్న విమానం మధురై నుంచి విశాఖకు ఆలస్యంగా చేరుకుంది. ఎయిర్ పోర్టు నుంచి ప్రధాని మోదీ ఐఎన్ఎస్ డేగకు చేరుకోగా.. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ ప్రధానికి స్వాగతం పలికారు.
ప్రధాని మోదీ పర్యటనతో విశాఖలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 6వేల 700 మంది పోలీసులతో పహారా కాస్తున్నారు. శనివారం విశాఖ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విశాఖ నగర వ్యాప్తంగా సెక్షన్ 30 అమలు చేశారు.