Arava Sreedhar Representative Image (Image Credit To Original Source)
Arava Sreedhar: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై కేసు నమోదైంది. NHRC ఆదేశాలతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు పోలీసులు. మహిళా ఉద్యోగి జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు ఫైల్ చేశారు. 22/2026 నెంబర్ పై బీఎంఎస్ 318(2), 318(4), 351(2) సెక్షన్ల కింద కోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
అరవ శ్రీధర్ పై మహిళ లైంగిక ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా అరవ శ్రీధర్ ను జనసేన అధిష్టానం ఆదేశించింది. దీంతో ఎమ్మెల్యే శ్రీధర్ జనసేన విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. మీడియాతో మాట్లాడిన ఆయన తన వివరణ మొత్తం అధిష్టానానికి చెప్పినట్లు తెలిపారు. అన్ని వివరాలు సమర్పించానని, పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పి అక్కడి నుంచి హడావుడిగా వెళ్లిపోయారు. శ్రీధర్ వివరణ ఆధారంగా జనసేన పార్టీ చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.
మరోవైపు జనసేన జనరల్ బాడీ సమావేశంలోనూ అరవ శ్రీధర్ వ్యవహారం చర్చకు రావడం, దీనిపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఫుల్ సీరియస్ అవడం జరిగాయి.
ఎమ్మెల్యే శ్రీధర్ పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఎమ్మెల్యే శ్రీధర్ ఏడాదిన్నర పాటు తనను లైంగికంగా వేధించాడని ఆ మహిళ ఆరోపించింది. అంతేకాదు ఈ ఆరోపణలకు సంబంధించి పలు వీడియోలు, ఛాటింగ్లు కూడా బయటపెట్టింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచింది. కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ టార్గెట్ చేసింది. జనసేన కాదు జానసేన అంటూ తీవ్ర విమర్శలు చేస్తోంది. మహిళల రక్షణ గురించి పదే పదే మాట్లాడే పవన్ కల్యాణ్.. అరవ శ్రీధర్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీస్తోంది.
మరోవైపు దీని వెనుక కుట్ర కోణం ఉందని ఎమ్మెల్యే శ్రీధర్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఏదో ఆశించి ఆ మహిళ ఎమ్మెల్యే శ్రీధర్ పై ఆరోపణలు చేసిందని మండిపడుతున్నారు. ఎమ్మెల్యేని రాజకీయంగా దెబ్బతీయడానికి ఎవరో వెనకుండి ఆమెను రెచ్చగొడుతున్నారని చెప్పారు.
Also Read: కల్తీ లడ్డూ వ్యవహారంలో కుట్రదారుల్ని శిక్షించేందుకు చర్యలు.. పవన్, సత్యకుమార్తో చంద్రబాబు భేటీ