Private Travels: కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగానే శనివారం నుంచి రాష్ట్రంలో 880 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బస్సుల్లో 50 శాతం సీట్లతోనే నడపాలని నిబంధన విధించడంతో పాటు ప్రజలు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి కనపరచడం లేదు.
పలు రకాలుగా ఆలోచించిన ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు తమంతట తాముగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం నుంచి 880 బస్సులు తిప్పడాన్ని నిలిపేస్తున్నట్లు రవాణా శాఖకు ముందుగానే తెలియజేశారు. కోవిడ్ నేపథ్యంలో బస్సులను నడపలేమని ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్కు తెలియజేశారు.
రవాణా శాఖ కూడా ఈ బస్సులకు సంబంధించి చెల్లించాల్సిన పాత పన్నులను వసూలు చేసింది. ముందస్తుగా రవాణా శాఖకు సమాచారం ఇవ్వడంతో బస్సులను నిలిపేసిన కాలానికి పన్ను మినహాయింపు పొందడానికి వీలుంటుందని రవాణా శాఖ అధికార వర్గాలు తెలియజేశారు.