Raghurama Custodial Torture Case
Raghurama Custodial Torture Case : ఏపీ అసెంబ్లీ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ పై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అయింది. గుంటూరు మొబైల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. దీంతో సునీల్ నాయక్ను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు మరోసారి సిద్ధమయ్యారు. ప్రస్తుతం సునీల్ నాయక్ బీహార్ అగ్నిమాపక, హోంగార్డుల విభాగం ఐజీగా ఉన్నారు.
Also Read : Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో రెండు రోజులు వానలేవానలు.. వారికి వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రఘురామరాజును గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారించిన గదిలో సునీల్ నాయక్ కూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో ఆయన్ను విచారించేందుకు పోలీసులు అనేక దఫాలుగా నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. ఆయన దర్యాప్తునకు సహకరించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఆయన్ను అరెస్టు చేయడానికి ఏపీ పోలీసులు బీహార్ రాష్ట్రంలోని పట్నా వెళ్లారు.
అయితే, అక్కడి నుంచి ఏపీకి తరలించేందుకు అవసరమైన ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయాలని కోరగా పట్నా హైకోర్టు ఆ అభ్యర్ధనను తిరస్కరించింది. దీంతో ఏపీ పోలీసులు గుంటూరు కోర్టును ఆశ్రయించి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని పిటీషన్ వేశారు. ఈ పీటిషన్ పై విచారించిన గుంటూరు మొబైల్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.
సునీల్ నాయక్ ను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసుల బృందం పట్నాలోనే మకాం వేసింది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు సునీల్ నాయక్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై లుకవుట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు గుంటూరు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ పై నిర్ణయం ప్రకటిస్తే నాయక్ను అరెస్టు చేయాలని పట్నాలోని ఏపీ పోలీసులు సిద్ధమయ్యారు.
తాజాగా.. గుంటూరు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేయడంతో సునీల్ నాయక్ ను అరెస్టు చేసి ఏపీకి తీసుకొచ్చేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.