×
Ad

Ambati Rambabu: మాజీమంత్రి అంబటి రాంబాబుకు రిలీఫ్.. ఆ కేసులోనూ బెయిల్.. రేపే రిలీజ్?

  • Published On : February 11, 2026 / 04:33 PM IST

Ambati Rambabu Representative Image (Image Credit To Original Source)

  • పట్టాభిపురం పీఎస్ కేసులో అంబటికి బెయిల్
  • పోలీసుల కస్టడీ పిటిషన్ కొట్టివేత
  • రేపు జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం

Ambati Rambabu: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. పట్టాభిపురం పీఎస్ లో నమోదైన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే పట్టాభిపురం పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించిన కేసులో అంబటికి బెయిల్ రాగా, ఇప్పుడు రెండో కేసులోనూ బెయిల్ రావడంతో రిలీఫ్ దక్కినట్లైంది.

ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించిన కేసులో అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తొలుత నల్లపాడు పీఎస్ లో నమోదైన కేసులో అంబటి రాంబాబుకు బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. బెయిల్ వచ్చినా అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు రాలేకపోయారు. దీనికి కారణం ఆయనపై పట్టాభిపురం పీఎస్ లో మరో కేసు నమోదు కావడమే.

పోలీస్ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2025 నవంబర్ 12న ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా పోలీసులతో అంబటి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో విధుల్లో ఉన్న సీఐని అడ్డుకున్నారని అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనపై పీటీ వారెంట్ జారీ కావడంతో, పట్టాభిపురం పోలీసులు మూడు రోజుల క్రితం ఆయనను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.

ఇప్పుడు ఈ కేసులోనూ ఆయనకు బెయిల్ వచ్చింది. రెండు కేసుల్లోనూ బెయిల్ రావడంతో అంబటి రాంబాబు రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు అంబటి రాంబాబుపై రాష్ట్రవ్యాప్తంగా 36 కేసులు నమోదయ్యాయి. మరో కేసులో అంబటిని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

Also Read: దువ్వాడ శ్రీనివాస్‌కు క్లాస్‌ పీకిన వైఎస్‌ జగన్.. ఏమైందంటే?