Sahithi Pharma Company
Sahithi Pharma Company Blast : అనకాపల్లి జిల్లా సాహితీ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో కంపెనీ లోపల మొత్తం 35మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 28మంది కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి కేజీహెచ్ సూపరిండెంట్ శివానంద వివరాలు తెలిపారు. సాహితీ ఫార్మా కంపెనీలో గాయపడిన వారందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మొత్తం ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు. అందులో మొదట ముగ్గురిని ఇక్కడికి తీసుకొచ్చారని ఆయన తెలిపారు. కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మిగతా నలుగురిని కూడా అత్యవసర వైద్య నిమిత్తం ఇక్కడికి షిఫ్ట్ చేశారని శివానంద చెప్పారు.
క్షతగాత్రులు అందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. ఏడుగురినీ బర్నింగ్ వార్డుకు షిఫ్ట్ చేశామన్నారు. గాయపడిన ఏడుగురికి దాదాపుగా 60 నుంచి 70 శాతం వరకు శరీరం కాలి పోయిందన్నారు. కొన్ని గంటలు గడిస్తే కానీ బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి ఏమీ చెప్పలేము అన్నారు. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద తెలిపారు.
శుక్రవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెండు రియాక్టర్లలో పేలుడు సంభవించడంతో భారీ అగ్నిప్రమాదం జరిగినట్లుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సాల్వెంట్ ను ఒక లారీలోకి ఎక్కిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు.
ఈ సాల్వెంట్ కు మండే స్వభావం అధికంగా ఉంటుంది. మంటలు అదుపులోకి రాకపోవడానికి అదే కారణం అని అధికారులు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఫార్మా కంపెనీ దగ్గరికి వెళ్లారు. ప్రమాదం ఎలా జరిగింది? అనేది అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అగ్నిప్రమాదంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ అలుముకుంది. పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా.. ఫార్మా సిటీలో తరుచుగా ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తున్న అంశం. దీని వెనుక అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం, పరిశ్రమల శాఖ అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.