టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగంగా సాగుతోంది.ఇప్పటికే దేవరాజ్ వాగ్మూలం రికార్డు చేసిన పోలీసులు ఆదివారం సాయి కృష్ణను విచారించనున్నారు. సాయితో పాటు శ్రావణి తల్లితండ్రులనుకూడా ఆదివారం పోలీసులు విచారించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు నుంచి సాయి బయలుదేరాడు. అటు శ్రావణి సోదరుడు శివ, తల్లిదండ్రులు కూడా హైదరాబాద్కు బయలుదేరారు. ఇప్పటికే దేవరాజ్ నుంచి కొంత సమాచారం రాబట్టిన పోలీసులు మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
సస్పెన్స్గా మారిన టీవీ ఆర్టిస్ట్ శ్రావణి కేసులో.. సాయికృష్ణారెడ్డి పాత్రపై పోలీసులు మరింతగా దృష్టి సారిస్తున్నారు. సాయి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. శ్రావణి సూసైడ్ మిస్టరీలో సాయి పాత్ర ఎంత ఉందన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. ఆడియో క్లిప్పింగులు, సీసీ పుటేజీల ఆధారంగా శ్రావణిపై సాయి వేధింపులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. విచారణలో సాయి చెప్పే అంశాలు కీలకంగా మారనున్నాయి. పోలీస్ విచారణకు తన దగ్గరున్న పూర్తి ఆధారాలతో వస్తానని సాయి ఇంతకు ముందే చెప్పాడు. దీంతో సాయి దగ్గరున్న ఆధారాలేంటి..? విచారణలో సాయి ఏం చెప్పబోతున్నాడు..? సాయిని ఏ ప్రశ్నలపై పోలీసులు విచారిస్తారు.. దేవరాజ్, సాయిని కలిపి విచారిస్తారా అనేది సస్పెన్స్గా మారింది.
మూడు రోజులుగా సాగుతున్న ఈ కేసు దర్యాప్తులో ట్విస్టుల మీద ట్విస్టులు బయట పడుతున్నాయి. మొదట దేవరాజ్ చుట్టూ కేస్ తిరిగితే.. ముచ్చటగా మూడో రోజు సాయి వైపు మళ్లింది. శ్రావణి కేసులో నిందితుడు దేవరాజ్ అని అంతా భావించారు.. కానీ తాను అమాయకుడిని అని చెప్పుకున్న సాయి మెడకు ఉచ్చు బిగుస్తోంది. దేవరాజ్ అందించిన సాక్ష్యాలు కేసును కీలక దశకు తీసుకువెళ్లింది. శ్రావణితో ఐదేళ్ల క్రితం నుంచే సాయికి పరిచయం ఉంది. ఈ పరిచయమే ప్రేమగా మారింది. అయితే కొత్తగా పరిచయం అయిన వ్యక్తులతో శ్రావణి చాలా క్లోజ్గా ఉండటం సాయికి నచ్చలేదు. ఇదే విషయంలో శ్రావణి – సాయికి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీనే శ్రావణి ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఉన్న ఆధారాలు శ్రావణి కేసులో.. సాయి పాత్ర కీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాయిని విచారించి.. కేసులో అసలు నిందితున్ని గుర్తించనున్నారు పోలీసులు.
ఆత్మహత్యకు ముందురోజు శ్రావణి, సాయి మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. రోడ్డుపై శ్రావణిని సాయి బెదిరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. శ్రావణిని ఆటోలో ఎక్కించి తీసుకెళ్లేందుకు సాయి ప్రయత్నించాడు. సాయి బెదిరింపులతో ఆటో ఎక్కేందుకు శ్రావణి భయపడింది. ఆటో ఎక్కేవరకు శ్రావణిని సాయి భయాందోళనకు గురిచేశాడు. రోడ్డు మీదనే గొడవ చేయడంతో చివరికి శ్రావణి ఆటో ఎక్కింది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా సాయిని పోలీసులు ప్రశ్నించనున్నారు.
రెస్టారెంట్లో సాయి తనపై దాడి చేశాడని శ్రావణి ఫోన్లో చెప్పడంతో కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. కేసు విచారణలో శ్రావణి ఫోన్ సంభాషణ, సీసీ కెమెరా దృశ్యాలు కీలకం కానున్నాయి. మరో వైపు శ్రావణి సూసైడ్కు సాయి కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టడంతో.. సాయి అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సాయి, కుటుంబ సభ్యులు కొట్టడంతోనే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
తన చావుకు సాయి కారణమని.. తల్లిదండ్రులు తనను వేధిస్తున్నారనే విషయాన్ని శ్రావణి చెప్పిన ఆడియోలు వెలుగులోకి వచ్చాయి. ఇక నిన్న పోలీసుల విచారణలో దేవరాజ్ కీలక విషయాలను వెల్లడించారు. గతంలోనూ తనను రక్తం వచ్చేలా సాయి కొట్టాడని సాక్షాలను బయటపెట్టాడు. అమ్మాయిలను సాయి ట్రాప్ చేస్తాడని.. శ్రావణిని సైతం అలానే ట్రాప్ చేశాడని దేవరాజ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోది.
ఇక కేసులో సాయి, దేవరాజ్ సంభాషణ ఆడియో క్లిప్ కీలకంగా మారింది. ప్రేమ పేరుతో దేవరాజ్ రెడ్డి వేధించడం వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని సాయి ఆరోపిస్తుండగా.. సాయి వేధింపులే శ్రావణి ఆత్మహత్యకు కారణమని దేవరాజ్రెడ్డి ఆరోపిస్తున్నాడు. శ్రావణి ఆత్మహత్యకు ముందు సాయి, దేవరాజ్కు మధ్య గొడవ జరిగింది. శ్రావణి కోసమే వీరిద్దరూ గొడవపడ్డారు. నీ వల్లే సమస్యలు అంటూ ఫోన్లో సాయితో దేవరాజ్ వాగ్వాదానికి దిగాడు. ప్రశాంతంగా ఉన్న అమ్మాయిని రోడ్డెక్కెలా చేశామని దేవరాజ్ ఆరోపించాడు.
శ్రావణికి నేను కావాలి.. ఇది ఫైనల్ అంటూ ఫోన్లో సాయికి దేవరాజ్ వార్నింగ్ ఇచ్చాడు. ఐదేళ్లుగా ప్రేమిస్తుంటే మధ్యలో నువ్వు వచ్చావని సాయి అన్నాడు. శ్రావణిని ఫోన్లైన్లో ఉంచి ఎవరిని లవ్ చేస్తున్నావో చెప్పాలని దేవరాజ్ నిలదీశాడు. దేవరాజ్నే ప్రేమిస్తున్నానని శ్రావణి చెప్పింది. మధ్యలో ఉండి డ్రామాలు చేయొద్దంటూ సాయికి దేవరాజ్ వార్నింగ్ ఇచ్చాడు.
ఎప్పటి నుంచో తనతో ఉన్న శ్రావణి ఇప్పుడు వేరే వాళ్లతో ఉండటాన్ని సాయి జీర్ణించుకోలేకపోయాడు. ఇదే విషయంలో శ్రావణితో గొడవకు దిగారు. వేధింపులకు పాల్పడ్డాడు. శ్రావణిని రోడ్డు మీదకు తెచ్చినంత పని చేశాడు. నడి రోడ్డుపై నిలదీసి.. వేధింపులకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. దేవరాజ్తో సాన్నిహిత్యాన్ని తగ్గించుకోవాలని శ్రావణిపై ఒత్తిడి కూడా తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
రెస్టారెంట్లో కలిసి ఉన్న శ్రావణి, దేవరాజ్పై దాడికి కూడా పాల్పడ్డారు. అయితే హోటల్లో గొడవ జరిగిన తర్వాతి రోజే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటన శ్రావణి ఆత్మహత్యకు సాయి ప్రధాన కారణంగా చూపిస్తోంది. ఆదివారం సాయిని పోలీసులు విచారించిన తర్వాత ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాలు బయటకు రానున్నాయి. సాయి విచారణ తరువాత కేసులో అరెస్ట్ పర్వం కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు.