ఏపీలో అక్టోబర్ 5న పూర్తి స్థాయిలో స్కూళ్లు రీఓపెన్?

  • Publish Date - September 28, 2020 / 03:56 PM IST

AP Schools Reopening : ఏపీలో వచ్చే అక్టోబర్ 5 నుంచి పూర్తి స్థాయిలో విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అక్టోబర్ 5న పూర్తి స్థాయిలో స్కూళ్లు తెరవాలని ఆలోచిస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు క్లాసులు ప్రారంభమయ్యాయని తెలిపారు.



విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి మేరకే క్లాసుల్లోకి అనుమతించామన్నారు. 50 శాతం మంది ఉపాధ్యాయులనే హాజరు కావాలని చెప్పామన్నారు. అకాడమిక్ క్యాలెండర్ విడుదల అనంతరం పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల సేవలు ఉంటాయని తెలిపారు. లెక్చరర్ల జీతాలపై సీఎం జగన్ నిర్ణయం మేరకు నడుచుకుంటామని మంత్రి సురేశ్ స్పష్టం చేశారు. విద్య, అధునీకరణకు సంబంధించి అన్నీ సిద్ధం చేశామని మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు.



ఏపీ సర్కార్ విద్యార్థులకు అందించే జగనన్న విద్యా కానుక పథకం ( Jagananna vidya kanuka ) అమలు కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.



కరోనా తరవాత అన్ని విద్యా సంస్థల్లో సమూల మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు. రాబోయే రోజుల్లో పరిస్థితిని ముందుగానే అంచనా వేసి మార్గదర్శకాలు రూపొందించినట్టు మంత్రి వెల్లడించారు.