Separate Development Corporations For Kammas Reddys Kshatriyas In Andhra Pradesh
Community Corporations : ఏపీ పాలిటిక్స్లో.. మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని.. ఓసీ కులాల్లో బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్లు మాత్రమే ఉన్నాయి. చాలా రోజుల నుంచి రెడ్డి, కమ్మ, క్షత్రియ కులాలు.. తమకు కూడా ప్రత్యేక కార్పొరేషన్ కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. సీఎం జగన్ ఎవరూ ఊహించని విధంగా.. ఒకేసారి కమ్మ, రెడ్డి, క్షత్రియ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు.
ఎప్పటి నుంచో ఈ కులాల నేతలు.. కార్పొరేషన్ల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు.. వాటిని ఏర్పాటు చేసి.. వారి కోరికను నెరవేర్చారు సీఎం జగన్. ఐతే.. ఇంత పెద్ద నిర్ణయం వెనుక.. కచ్చితంగా రాజకీయ కోణం ఉందనే చర్చ జరుగుతోంది.
సీఎం జగన్పై.. రెడ్డి కులం ముద్ర ఉంది. ఆయన.. తన సామాజిక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని.. ప్రతిపక్షాలు ఎన్నోసార్లు విమర్శించాయి. కీలక పదవుల్లో, కీలక బాధ్యతలు, స్థానాల్లో.. రెడ్డి సామాజికవర్గం వారే ఉన్నారనే వాదన ఉంది. దీంతో పాటు కమ్మ సామాజికవర్గంపై జగన్ దాడి చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. చంద్రబాబుతో సహా టీడీపీలో కమ్మ సామాజిక వర్గం నేతలను.. కేసుల ద్వారా వేధింపులకు గురి చేస్తున్నారని.. ఇటీవలి కాలంలో ఎన్నో ఆరోపణలొచ్చాయ్. మరో వైపు.. క్షత్రియ సామాజికవర్గానికి చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజుపై కేసు విషయంలోనూ.. ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.
కమ్మ, క్షత్రియ సామాజికవర్గాల విషయంలో.. వస్తున్న ఆరోపణలకు ఒకేసారి చెక్ పెట్టారు సీఎం జగన్. తనకు.. అన్ని కులాలు సమానమే అనే సంకేతాలిచ్చేందుకు.. జనరల్ కులాల్లో మిగిలిన మూడింటికి.. ఒకేసారి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఐతే.. దీని వెనుక రాజకీయ కోణం కూడా ఉందన్న టాక్ నడుస్తోంది. వైసీపీకి కాస్త వ్యతిరేకంగా ఉండే కమ్మ, క్షత్రియ వర్గాలను.. కార్పొరేషన్ల ఏర్పాటుతో.. అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ సాగుతోంది. ఐతే.. ఈ డెసిషన్తో.. ఆ రెండు సామాజికవర్గాలు వైసీపీ ప్రభుత్వం పట్ల ఎలా వ్యవహరిస్తాయన్నది తేలాలంటే.. కొన్నాళ్లు ఆగాల్సిందేనంటున్నారు విశ్లేషకులు.